'ఇప్పుడు గుర్తొచ్చిందా? ఉపదేశించిదెవరు?.. పవన్ను లెక్క చేయం'
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లెక్కలోకి తీసుకోబోమని, ఆయన్ను ఖాతరు చేసేది లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్యను ప్రస్తావిస్తూ.. బీజేపీని తప్పుబట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరిపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లెక్కలోకి తీసుకోబోమని, ఆయన్ను ఖాతరు చేసేది లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇన్ని రోజులు మౌనం వహించి ఇప్పుడెందుకు రోహిత్ ఆత్మహత్యపై వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ ను నిలదీశారు కిషన్ రెడ్డి.
రోహిత్ ఆత్మహత్యపై స్పందించడానికి రాత్రికి రాత్రే ఎవరైనా ఉపదేశం చేశారా? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తెరపై ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు స్పందించడంలో ఆంతర్యమేంటని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా స్పందించినా.. మీడియా ముఖంగా స్పందించినా.. ఆయన వ్యాఖ్యలను పట్టించుకునేది లేదని కుండబద్దలు కొట్టారు.
రోహిత్ ఆత్మహత్యపై పవన్ అప్పుడే స్పందించి ఉంటే సమాధానం చెప్పేవారిమని, ఇప్పుడు మాట్లాడితే స్పందించేది లేదని అన్నారు. అందరు మరిచిపోయిన అంశం పవన్ కు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.