ఏపీపై రేవంత్కు కడియం సవాల్, కెసిఆర్! సకల జనుల సమ్మెకు వెన్నుపోటు మాటేమిటి: కిషన్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డికి గురువారం నాడు సవాల్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు టిఆర్ఎస్ కట్టుబడి ఉందని, అయితే ఏపీలో టిడిపి ప్రభుత్వం ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తీర్మానం చేయించాలని సవాల్ చేశారు.
ప్రశ్నించే హక్కు లేదా: పొంగులేటి
వరంగల్ ఉప ఎన్నికలు ప్రభుత్వానికి చెంప పెట్టు కావాలని కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. వైసిపి అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం సరికాదన్నారు.
టిఆర్ఎస్తో జగన్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే హక్కు కూడా లేదా అన్నారు. కెసిఆర్ సభలో నిలదీసిన విజయ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరు: కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ ఉద్యమం సమయంలో తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లలేదని ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్కు బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఉన్నారా అని కేసీఆర్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఉద్యమం నుంచి తాను పారిపోలేదన్నారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఎంతో చెప్పాలన్నారు. ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరని నిలదీశారు. సాగరహారంలో కేసీఆర్ పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన వారి కుటుంబాలను విస్మరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక... కేసీఆర్ ఎదురు దాడి చేస్తున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పరాజయం పాలుకావడం ఖాయమన్నారు.