కెసిఆర్కే నష్టం!: రేవంత్ ఇష్యూపై కిషన్ ఆసక్తికర వ్యాఖ్య, టిడిపితో పొత్తుపై తేల్చేశారు
వరంగల్: ఓటుకు నోటు వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు రాజకీయంగా వేడి రాజేసిన విషయం తెలిసిందే. కిషన్ దీనిపై వరంగల్ జిల్లాలో సోమవారం మాట్లాడారు.
ఓటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం పార్టీ కంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే ఎక్కువ నష్టం కలిగించిందని కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్మిక సంఘాల మధ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చీలిక తెచ్చారని ఆరోపించారు.
దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల సమస్యలు తీర్చాలన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. పొత్తుపై ఇప్పటి వరకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు పొత్తుపై కిషన్ రెడ్డి తేల్చి పారేయడం గమనార్హం.

కార్మికుల సమ్మె పైన ఆదివారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల మధ్య చీలికలకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉందని, అయినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు.
కార్మికులు తెలంగాణ కోసం సమ్మె చేయవచ్చు కానీ, పొట్టకూటి కోసం సమ్మె చేస్తే తప్పా అని నిలదీశారు. కార్మికుల సమస్యలు న్యాయబద్ధమైనవని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.
ఓటుకు నోటు వ్యవహారంపై బిజెపి మొదటి నుండి ఆచితూచి స్పందిస్తోంది. ఈ అంశం కోర్టులో ఉన్నందున.. కోర్టు తీర్పు తర్వాత స్పందిస్తామని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అంశంతో తమకు సంబంధం లేదని కూడా చెప్పారు. అయితే, రాజకీయంగా మాత్రం టిఆర్ఎస్కు నష్టం జరిగిందని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications