కేసీఆర్ హుందాగా వ్యవహరించాలి: ప్రధాని మోడీ పర్యటనపై కిషన్ రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బుధవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 12న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీరనుందన్నారు. సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రామానికి ఆహ్వానించానని తెలిపారు.
కేసీఆర్ హుందాగా వ్యవహరించి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయంలో రాజకీయాలు వద్దని సీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర రైతులకు రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా ఎంతో లబ్ధి చేకూరనుందన్నారు.
గతంలో రాష్ట్రంలో ఎరువులు సమస్య తీవ్రంగా ఉండేదని.. రామగుండం ఫ్యాక్టరీతో వ్యవసాయ రంగానికి యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణలో తక్కువ సమయంలోనే యూరియా అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి ప్రారంభించడంతో ఎరువుల కోసం కేంద్రానికి లేఖ రాసే అవసరం కూడా ఉండదన్నారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా టీఆర్ఎస్ వ్యవహారంపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అన్నారు. ప్రధాని మోడీకి కనపడకుండా తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ మరోసారి కావాలనే ఢిల్లీకి వెళ్తున్నట్లు ఉందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు అరవింద్. మునుగోడులో నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి మంచి అవకాశం దొరికిందన్నారు. మునుగోడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసి టీఆర్ఎస్ గెలిచిందన్నారు.
రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జీల బడ్జెట్ పూర్తిగా కేంద్రానిదేనని చెప్పారు. గోవింద్ పేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వచ్చే నెలలో ప్రారంభమవుతుందన్నారు. అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామమన్నారు అరవింద్. గడప గడపకు బీజేపీ నినాదంతో గ్రామాల్లోనూ పర్యటిస్తామన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రచారం చేస్తామన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు.