టిఆర్ఎస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల భయం, కుట్రలు: కిషన్, ‘తుగ్లక్లా కెసిఆర్’
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటేనే టిఆర్ఎస్ పార్టీకి భయం పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. గెలుపుపై ధైర్యం లేకనే రిజర్వేషన్ల ప్రకటనపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల ప్రక్రియ గడువు కుదింపుతో ప్రతిపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా టిఆర్ఎస్ కుట్ర పన్నుతోందన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలకు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
టిఆర్ఎస్ దివాళాకోరు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన మండిపడ్డారు. దొంగదారుల్లో గెలవాలనుకుంటున్న టిఆర్ఎస్ ప్రయత్నాలను తాము వమ్ము చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ తుగ్లక్ నిర్ణయం వల్లే..: ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తుగ్లక్లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. సీఎం తుగ్లక్ నిర్ణయంతో మెట్రోపనుల్లో జాప్యం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించామని చెప్పారు. గోదావరి జలాలను తేచ్చేందుకు రూ.3600 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం అసలు లెక్క అది కాదని.. టిఆర్ఎస్ ప్రభుత్వం రూ.120 కోట్లే ఖర్చు చేసిందని ఉత్తమ్ చెప్పారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ ఏకపక్ష చర్య అని అన్నారు.
గ్రేటర్లో టిఆర్ఎస్కు పట్టులేదు: వివేక్
గ్రేటర్లో టిఆర్ఎస్కు పట్టులేదని తెలుగుదేశం ఎమ్మెల్యే వివేక్గౌడ్ అన్నారు. మేయర్ పదవిని దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. కుక్కలు చింపిన విస్తరిలా డివిజన్ల పునర్విభజన ఉందని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీలు ఎక్కడి వారైనా జీహెచ్ఎంసీలో ఓటు హక్కు కల్పిస్తూ సవరణ తీసుకొచ్చారంటూ తెలిపారు. రిజర్వేషన్ల వివరాలను టిఆర్ఎస్, ఎంఐఎంలకు రహస్యంగా అందజేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు 14 రోజుల గడువు దేశంలో ఏ నగరంలో లేదని ఇదంతా చూస్తుంటే టిఆర్ఎస్ పెద్ద స్కామ్కు తెరలేపినట్లు తెలుస్తోందని ఎమ్మెల్యే వివేక్గౌడ్ అన్నారు.












Click it and Unblock the Notifications