కోదండరాం కొసమెరుపు..! కూటమి ఓటమికి కారణం చెప్పిన మాస్టారు..!!
హైదరాబాద్ : యుద్ద భూమిలో గాని, రణ రంగంలో గాని శత్రువుపై గెలిస్తే ఒకే కారణం ఉంటుంది.. గెలవక పోతే వంద కారణాలుంటాయి. తెలంగాణ ఎన్నికల్లో అచ్చు ఇదే వాతావరణం నెలకొంది. అదికార టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ఏకమైన మహా కూటమి అనూహ్య పరాజయం పాలైంది. ఊహించని ఈ పరాభవం పట్ల నేతలందరూ సమీక్ష నిర్వహించుకుంటూ ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని విశ్లేషిస్తున్నారు. తాజాగా కూటమిలో కీలక భూమిక పోషించి చివరి నిమిషం వరకూ గెలుపు పట్ల ధీమాగా ఉన్న కోదండరాం కూటమి ఊహించేని ఓటమితో అవాక్కయ్యారు. దీంతో పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్ష నిర్వహించి సంచలన అంశాలు చెప్పుకొచ్చారు.
కర్ణుడి చావుకు వంద కారణాలు..! కూటమి ఓటమికి కూడా అన్నే కారణాలంటున్న నేతలు..!!
తెలంగాణలో ఎన్నికలు ముగిసినా.. వాటి తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా పోవడంలేదు. ఎవరో ఒకరు.. ఎక్కడో దగ్గర ముందస్తు ఎన్నికలపై ఏదో మాట అంటుండడంతో ఆ వేడి ఇంకా చల్లారలేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సంబరాలు చేసుకుంటుండగా, మిగిలిన పార్టీలు మాత్రం ఓటమికి గల కారణాల గురించి చర్చలు జరుపుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో భారీగా దెబ్బైపోయిన ప్రజాకూటమి నేతలు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి రానీయకూడదని ఏర్పడిన ప్రజాకూటమిలో సీట్ల సర్ధుబాటు గురించే ఎక్కువ సమయం తీసుకున్న విషయం తెలిసిందే..!
స్వయం క్రుతాపరాధం..! నేతలతీరు పై అసహనం వ్యక్తం చేస్తున్న కోదండరాం..!!
అంతే కాకుండా రెబెల్స్ గొడవలు, సీట్ల కేటాయింపు తదితర విషయాలతో ఆయా పార్టీల్లో సమన్వయం కరువైంది. పార్టీలు, నేతలు కలిసినంత వేగంగా ఆయా పార్టీల కార్యకర్తలు కలవలేకపోయారు. దీంతో కొన్ని స్థానాలను మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఓట్ల బదిలీ కూడా జరగలేదు. ప్రజాకూటమిలోని కాంగ్రెస్ పార్టీ 19, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలను దక్కించుకున్నా.. తెలంగాణ జనసమితి, సీపీఐ అయితే ఖాతానే తెరవలేదు. ఈ ఎన్నికల్లో ఓటమిపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
కోదండరాం కి ఉద్యమ నేతగా మంచి పేరు..! పార్టీని నడిపించలేకపోయాడనే విమర్శ..!!
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం, ఎంతో మంది విద్యార్థులను ఉద్యమం వైపు తిప్పడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆయన, తెలంగాణ జనసమితిని మాత్రం విజయవంతంగా నడపలేకపోయారు. మొదటి ప్రయత్నంలోనే ఆయన పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అసలు ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి కారణాలు ఏంటనే దానిపై కోదండరాం తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటమికి చంద్రబాబే కారణం..! తేల్చేసిని మాస్టారు..!
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ప్రచారం ప్రజాకూటమి ఓటమికి కారణాల్లో ఒకటన్నారు. ఆయన ప్రచారాన్ని టీఆర్ఎస్ బాగా వాడుకుందని, దీంతో రాజకీయ పోరు కాస్తా కేసీఆర్, చంద్రబాబుల మధ్యే అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే కోదండరాం.. చంద్రబాబును తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించాలని కోరిన విషయం తెలిసిందే. కోదండరాం వ్యాఖ్యల తర్వాత టీడీపీ అభిమానులు దీనిని గుర్తు చేస్తూ ఆయనపై ప్రతి విమర్శలు చేయడం గమనార్హం.