ఆ రెండు వ్యాఖ్యలేనా?: కేసీఆర్పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజే ఏసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ముందు కోదండరాం ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు రెండు సార్లు యత్నించినా, తనకు అపాయింట్ మెంట్ లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు జేఏసీ తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి ఆఫీస్కు పంపుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. అయినా తనపై టీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు.
మంత్రుల విమర్శలైప తాను వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయబోనని ఆయన అన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడబోనని, జేఏసీనే స్పందిస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్ధిక పరమైన వ్యత్యాసం పెరిగిపోతుందన్న విషయాన్నే తాను చెప్పానని, ఇందులో తప్పేముందని ఆయన అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయని, అవసరమైతే వాటిని ప్రభుత్వం పరిశీలించుకోవచ్చని ఆయన అన్నారు.
ఆ రెండు వ్యాఖ్యలే
రెండు రోజుల క్రితం కోదండరాం చేసిన రెండు వ్యాఖ్యలే టీఆర్ఎస్ నేతలను ఆగ్రహావేశాలకు గురి చేశాయన్న రాజకీయ విశ్లేషకుల అంచనా. 'రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం', 'చేతకాకుంటే కేసీఆర్ పదవి నుంచి దిగిపోవాలి' అని కోదండరాం చేసిన ఈ రెండు వ్యాఖ్యలే టీఆర్ఎస్లో ఆగ్రహాన్ని రగిల్చాయి.
అయితే ఈ వ్యాఖ్యలను తాను చేసినట్లు వస్తున్న వార్తలపై కోదండరాం బుధవారం ఉదయం ఓ తెలుగు ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఖండించలేదు. అలాగని సదరు మాటలు తన నోటి నుంచి వచ్చాయని కూడా ఆయన చెప్పలేదు. తాను చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డై ఉన్నాయని, ఆ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అవసరమనుకుంటే సదరు వీడియోలను పరిశీలించి తన వ్యాఖ్యలను తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. ఇక, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్లోని జేఏసీ కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు, ఆయనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగిన నేపథ్యంలో జేఏసీ సమావేశమైన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, ఆచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై లోతుగా ఈ సమావేశంలో అధ్యయనం చేయనున్నారు. కాగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరాం ఒక్కసారిగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో తెలంగాణ జెఎసి, పాలక పార్టీ టిఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కోదండరామ్ కదలికలను అన్ని పార్టీలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. అయితే జేఏసీ సమావేశంలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అనే విషయంపై కూడా చర్చలు సాగుతున్నాయని సమాచారం. కోదండరామ్ ఏం చేస్తారు, ఏ దిశలో పయనిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టిఆర్ఎస్ ఎప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా, కాంగ్రెస్, టిడిపి నాయకులు కోదండరాంకు మద్దతు పలుకుతున్నాయి.
అపాయింట్మెంట్ ఇవ్వలేదు: కేసీఆర్పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు
మరోవైపు జేఏసీ చైర్మన్ కోదండరాంకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం వర్సిటీలో పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. తెలంగాణ ద్రోహులెవరో, ఉద్యమకారులు ఎవరో గుర్తించాలని ప్రభుత్వానికి హితువు పలికాయి.
అపాయింట్మెంట్ ఇవ్వలేదు: కేసీఆర్పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు
ఉద్యమ సమయంలో సమైక్యవాదులకు తొత్తులుగా పని చేసిన వ్యక్తులు నేడు మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించడం సిగ్గు చేటని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు పేర్కొన్నారు. కోదండరాంకు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాణహాని ఉందని నేపథ్యంలో తక్షణమే ఆయనకు తగిన రక్షణను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఓయు జేఏసీ, టీఎస్ జేఏసీలు విన్నవించాయి.
అపాయింట్మెంట్ ఇవ్వలేదు: కేసీఆర్పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ద్యమంలో నిస్వార్థంగా పని చేసిన రాజకీయ జేఏసీ చైౖర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించిన మంత్రులు వెంటనే బహిరంగ క్షమా పణ చెప్పాలని టీడీపీ నగర సెక్రటరీ జనరల్ ఎమ్మెన్. శ్రీనివాసరావు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేకల సారంగపాణి డిమాండ్ చేశారు. ఉద్యమానికి ఎవరేం చేశారన్నది యావత తెలంగాణకు తెలుసని అన్నారు.
అపాయింట్మెంట్ ఇవ్వలేదు: కేసీఆర్పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు
కోదండరాంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజల గొంతు నొక్కితే వంద జేఏసీలు పుట్టుకొస్తాయని తెలంగాణ ఉద్యమ వేదిక, ప్రజా తెలంగాణ, ఓయూ జేఏసీ సంఘాల నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, శ్రీశైల్ రెడ్డి, సందీప్చమర్, నరేందర్గౌడ్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అన్నారు.