రేవంత్ రెడ్డి దెబ్బ: తొలిసారి కేసీఆర్ డిఫెన్స్? -భూముల వేలంపై సర్కారు వివరణ -పరువునష్టం హెచ్చరిక
తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న భూముల వేలం వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి ఈ వివాదంపై కేసీఆర్ సర్కారు స్పందించింది. ఇప్పటికే ఆ భూముల(కొంత భాగాన్ని) వేలం ఆపాల్సిందిగా హైకోర్టు ఆదేశాలివ్వగా, భూవేలంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే, సదరు వేలం పాటలో ఎలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరగలేదంటూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు సుదీర్ఘ వివరణ ఇచ్చింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది..

భూవేలం..వెయ్యి కోట్ల కుంభకోణం
తెలంగాణలో ప్రభుత్వానికి చెందిన విలువైన భూమిని కేసీఆర్ తెగనమ్ముతున్నాడని, కోకాపేట, ఖానామెట్ లో నాటి కాంగ్రెస్ హయాంలో దళితులకు పంచిన భూమిని ప్రస్తుత కేసీఆర్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పద్దతిలో అమ్ముకుందని, బిడ్ల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిందని, ఎక్కువ ధరలు పలికే ఆ భూముల్ని..కేసీఆర్, కేటీఆర్ తమ బంధువులు, దగ్గరి వ్యక్తులకు తక్కువ ధరలకే కట్టబెట్టారని, మొత్తంగా భూముల వేలంలో రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని, ప్రభుత్వం గనుక విచారణకు ఆదేశిస్తే ఆధారాలను ఇస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండ్రోజుల కిందట సంచలన ప్రకటన చేశారు. రేవంత్ ఆరోపణలపై ఆచితూచి స్పందించిన ప్రభుత్వం ఇవాళ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. అందులో..

ఆ బాధ్యత ఉంది కాబట్టే..
కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు సర్వత్రా వ్యాప్తి కావడం, వాటిపై డిబేట్లు సాగుతోన్న క్రమంలో కాంగ్రెస్ ఎంపీ పేరును ప్రస్తావించకుండానే తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఇటీవల చేపట్టిన భూముల వేలంలో విధానపరమైన అవకతవకలు జరిగాయని కొన్ని వార్తా పత్రికలలో వచ్చిన కథనాలపై రికార్డుల ఆధారంగా ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత ఉన్నదని తమపై ఉందని, అందుకే ఈ వివరణ ఇస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

అసలు భూముల వేలం ఎందుకంటే
నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాలకు సంబంధించి ప్రభుత్వ భూములను వేలం వేయడం అనేది గతంలో ఉమ్మడి రాష్ర్టంలోనూ, దేశంలోని వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్నదని, ఢిల్లీలోని డెవలప్మెంట్ అథారిటీ, మహారాష్ర్ట, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి వివిధ రాష్ట్రాలు ఇలాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతున్నదని, రెవెన్యూ సముపార్జన అనేది దీని ముఖ్య ఉద్దేశ్యంగా కనిపించినప్పటికీ, పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన వృద్ధి, రోజు రోజుకు పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడమే భూముల వేలం వెనకున్న ముఖ్య ఉద్దేశం అని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది.

అక్రమాల ఆరోపణలు నిరాధారం..
ఈ ఏడాది జులై 5, 16వ తేదీల్లో కోకాపేట్కు సంబంధించి 49.45 ఎకరాల విస్తీర్ణం గల స్థలం 8 ప్లాట్లు, ఖానామెట్లో 15.01 ఎకరాల విస్తీర్ణం గల స్థలం 5 ప్లాట్లకు జరిగిన ఈ-వేలం పాట అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించామని ప్రభుత్వం తెలిపింది. ''భూముల వేలంపై ఆరోపణలు నిరాధారం. భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదు. ఎవరైనా ఒక బిడ్ను ప్రభావితం చేస్తారనేది అపోహే. ఆన్లైన్లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం ఉంటుంది. 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్ ఖరారు అవుతుంది. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యం లేదు'' అని ప్రభుత్వం పేర్కొంది.

రేవంత్ దాడి.. తొలిసారి కేసీఆర్ డిఫెన్స్?
కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం, సీబీఐతో దర్యాప్తునకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తామనడం, అసలు బిడ్డింగ్ నిర్వహించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో వివరణ ఇచ్చుకున్న ప్రభుత్వం.. భూముల వేలానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరికాదని, ఆ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని, అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా వేలం నిర్వహించామని వివరించింది. కాగా, గతంలోనూ భూ ఆక్రమణలపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కేసీఆర్ సర్కారు జైలుకు పంపింది. అయితే, ఇప్పుడు మాత్రం కేవలం హెచ్చరికతో సరిపెట్టడం గమనార్హం. భూవేలంపై అనుచిత ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రభుత్వం హెచ్చరించింది. భూముల వేలంపై ప్రభుత్వ వివరణ వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో అనూహ్య కామెంట్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి దెబ్బకు సీఎం కేసీఆర్ తొలిసారి డిఫెన్స్ లో పడ్డారనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications