కోమటిరెడ్డి ప్రచారంలో పరేషాన్... కొద్దిలో గులాబీ కండువా పడేది
తెలంగాణ రాష్ట్రమంతా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. ఇంకా నెలరోజుల సమయం ఉండగా అప్పుడే ఎన్నికల వాతావరణం తెలంగాణను ఆవహించింది. నేతలు ప్రచారంతో దూసుకుపోతుండగా మరికొంతమంది ఆశావాహులు తమకే టికెట్ కేటాయించాలంటూ ధర్నాలు చేస్తున్నారు. ఇక టికెట్ దక్కించుకున్న నాయకులు మాత్రం ఎవ్వరితో పనిలేకుండా తమ ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే నేతలు పలు ఫీట్లు కూడా చేస్తున్నారు. కొందరు చిన్నపిల్లలకు స్నానం చేయిస్తూ ఓటు అడుగుతుండగా మరికొందరు ఛాయ్ చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. మరికొందరి నేతలకు ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓట్లు అడగటానికి వచ్చిన మరికొందరి నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళుతున్న నేతలు తమ ప్రత్యర్థి ఇళ్లలోకి కూడా వెళ్లి ఓటు అడుగుతున్నారు. కొద్ది రోజుల క్రితం గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ దగ్గరకు వెళ్లి మాటలు కలిపారు. తాజాగా నల్గొండ కాంగ్రెస్ తాజామాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సూర్యపేటలో ప్రచారం నిర్వహిస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఓ మార్కెట్కు ఓట్లు అడిగేందుకు వెళ్లిన కోమటి రెడ్డికి అక్కడి టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు గులాబీ కండువా వేసేందుకు ప్రయత్నించారు. కోమటిరెడ్డి వారించినప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్త వెనక్కు తగ్గలేదు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఎట్టకేలకు టీఆర్ఎస్ కార్యకర్త వెనక్కు తగ్గటంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ప్రచారంతో ముందుకు కొనసాగారు. అంతకుముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి తన నియోజకవర్గంలో ఓటు అడిగేందుకు వెళ్లగా ఓ మహిళ ఆయన్ను నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు. సమస్యలు పరిష్కరించని గోపీనాథ్కు ఎందుకు ఓటువేయాలని ఆమె ప్రశ్నించారు. మిగతా వారికి కూడా ఓటు వేయొద్దని చెబుతానని మహిళ చెప్పడంతో గోపీనాథ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.