మీరు బెల్ కొడితే కూర్చోవాలా: పద్మాపై కోమటిరెడ్డి, హరీష్ సీరియస్, ఎట్టకేలకు సారీ
కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చర్చ ముగిసిందని బెల్ కొట్టారు. దీనిపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన చర్చ సందర్భంగా అసెంబ్లీలో బుధవారం నాడు గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చర్చ ముగిసిందని బెల్ కొట్టారు. దీనిపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ విద్యార్థుల పైన కక్ష కట్టారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అంతకుముందు కోమటిరెడ్డి వెంకట రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. రీయింబర్సుమెంట్స్ పైన ఆంక్షలు విధించారని, సరికాదన్నారు. 2016-17 సంవత్సరానికి ఒక్క పైసా విడుదల చేయలేదన్నారు.
నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'
ఆ తర్వాత మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ బెల్ కొడితే కూర్చోవాలా అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ... చైర్ను బెదిరించడం సరికాదన్నారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చైర్ను అవమానించినందుకు కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు.
బాధపడితే క్షమించండి: కోమటిరెడ్డి
తాను డిప్యూటీ స్పీకర్ను, చైర్ను అవమానించాలని అనలేదని, ఒకవేళ తన మాటలతో బాధపడి ఉంటే మాత్రం దానికి క్షమాపణ కోరుతున్నానని కోమటిరెడ్డి చెప్పారు. అంతకుముందు జానారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు.