కాంగ్రెస్ వీడను, కేసీఆర్ను ఏమనను: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడనని, అయితే, అదే సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మాత్రం విమర్శించనని చెప్పారు.
నల్గొండలో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వంటి వాటి కోసం కేసీఆర్ రూ.170 కోట్లు మంజూరు చేశారని, అలాంటప్పుడు ఆయనను విమర్శించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన కుమారుడి స్మారకస్థూపాన్ని నిర్మించి భవనం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వస్తారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
మంత్రుల సాక్షిగా విద్యార్థులపై పిడిగుద్దులు
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మంగళవారం నాడు విద్యార్థులపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. అతనిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి చివరకు 31 విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్లో జరిగింది.
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం కేటీఆర్తో పాటు మరో మంత్రి పోచారం శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నందుకు తెరాస నేతలు దాడికి పాల్పడ్డారు. సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం మంత్రులు పోచారం, కేటీఆర్ వచ్చారు.
ఫీజురీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో వారం రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులు వీరిని అడ్డుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సిరిసిల్లకు తరలివచ్చారు. మంత్రులు పోచారం, కేటీఆర్లు రావడంతోనే వారు బైఠాయించి నినాదాలు చేశారు.
ఏబీవీపీ జెండాలు చూడగానే విచక్షణ కోల్పోయిన కొందరు తెరాస కార్యకర్తలు దాడికి ఉపక్రమించారు. పోలీసులు తమను అరెస్టు చేస్తారని భావించిన విద్యార్థులు ఊహించని విధంగా నేతలు దాడి చేయడంతో ఖంగుతిన్నారు. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయడానికి యత్నించారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు బలవంతంగా నేతలను నెట్టేసి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
అనిల్ అనే విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కొక్కుల సాయిబాబా, జిల్లా కన్వీనర్ ప్రసాద్, బాగ్ కన్వీనర్ జింక అనిల్ సహా 31 మందిని అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. దాడికి నిరసనగా ఏబీవీపీ బుధవారం జిల్లా వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది.