ఫలితం పై తేల్చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..!!
మునుగోడు ఎన్నికల ఫలితం పైన బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కౌంటింగ్ కేంద్రాలకు ప్రధాన అభ్యర్ధులు చేరుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు అనేది తేలి పోయింది. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కానుంది. ఈ సమయంలో ఇప్పటికే గెలుపు పైన ధీమాగా ఉన్న టీఆర్ఎస్ - బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. కానీ, లోలోపల మాత్రం వారికి చిన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. పోలింగ్ ట్రెండ్స్ ఢిల్లీ నివేదికలు అనుకూలంగా ఉండటంతో బీజేపీ నేతలు ఫలితం పైన ఆశలు పెంచుకుంటున్నారు.
కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఎన్నికల కమిషన్ ఈటీపీబీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు(మొత్తం 686) పూర్తికాగానే.. చౌటుప్పల్ మండల ఈవీఎంలను లెక్కిస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ ను కొట్టి పారేసారు. ఓటర్లను టీఆర్ఎస్ నేతలు భయ పెట్టారని ఆరోపించారు. సైలెంట్ ఓటింగ్ జరిగిందని చెప్పారు. 93 శాతం పోలింగ్ జరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా విశ్లేషించారు.అదే జరిగితే, తన గెలుపు సులువు అవుతుందన్నారు. అదే సమయంలో ఎవరు గెలిచినా అయిదు వేల లోపే మెజార్టీ ఉంటుందని కీలక వ్యాఖ్య చేసారు.
మహిళల ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ చెబుతున్నా టీఆర్ఎస్ మాత్రం మహిళలకే తమకే పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నా.. రికార్డు స్థాయి పోలింగ్ ఇప్పుడు టెన్షన్ కు కారణమవుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే కాంగ్రెస్ - బీజేపీ అభ్యర్ధులు చేరుకున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సూచనలు చేస్తున్నారు. అటు నల్గొండ కేంద్రంగా టీఆర్ఎస్.. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ ముందుగానే విజయోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 21 టేబుళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ప్రతీ రౌండ్ 20 నిమిషాల సేపు కౌంటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది.