బ్రోకర్లు, జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా? శనిలా కుంతియా: రేవంత్పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
నల్గొండ: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం వేసిన కమిటీలు కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు ఆ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విజయశాంతికి కీలక పదవులు: రేవంత్కు ప్రాధాన్యతపై సీనియర్ల అసంతృప్తి, 'సురేష్ రెడ్డి పేరు'
వార్డు మెంబర్గా గెలవని వారికీ ప్రాధాన్యతా?
గాంధీభవన్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదనీ.. ప్రజల్లో ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యముందో తెలుసుకోవాలని ఏకంగా పార్టీ నాయకత్వానికి హితబోధ చేశారు కోమటిరెడ్డి రాజపాగోపాల్ రెడ్డి. వార్డు మెంబర్గా కూడా గెలిచే సత్తా లేనివారికి కమిటీలలో ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు.
తెలంగాణకు శనిలా.. ఎవరికీ భయపడను
కాంగ్రెస్ పార్టీకి కుంతియా శనిలా తయారయ్యాడని మండిపడ్డారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. పైరవీకారులకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలవదని స్పష్టం చేశారు. కుంతియాకు ఫోన్ చేసి.. ప్రజలను కోరుకున్నవారిని ముందు పెట్టాలని సూచించానని చెప్పానని తెలిపారు. వందమంది కుంతియాలొచ్చినా ఏం చేయలేరని అన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ అవసరమా? లేదా?
కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ అవసరమా? లేదా? అని నిలదీశారు. ఎన్నిసార్లు అవమానించినా కాంగ్రెస్ పార్టీకి సేవలందించామని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్లే కాంగ్రెస్ ఓడిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కోమటిరెడ్డి బ్రదర్స్ శ్రమిస్తుంటే.. పదవులు మాత్రం బ్రోకర్లకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు.
జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా?
ప్రజల్లో బలంగా ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి.. జైలుకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనలాంటి నాయకులను అవమానిస్తారా? అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుపాలైన నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
బ్రోకర్లకు స్థానం కల్పించి..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం నియమించారు. పలువురు సీనియర్ నేతలకు ప్రాధాన్యత దక్కకలేదనే అసంతృప్తితో రాజగోపాల్ రెడ్డి గురువారం పైవిధంగా స్పందించారు. బ్రోకర్లందరికీ ఈ కమిటీల్లో స్థానం కల్పించి.. తమను ఎక్కడో కిందపడేశారని తీవ్రంగా మండిపడ్డారు.