అర్దరాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హంగామా; ఆర్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా.. దేనికంటే!!
మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీల ఉత్కంఠ రేకెత్తించగా నిన్న అర్ధరాత్రి మునుగోడు నియోజకవర్గంలో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హంగామా సృష్టించారు. పోలీసులు టిఆర్ఎస్ పార్టీ నేతలకు సహకరిస్తున్నారని, స్థానికేతరులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నియోజకవర్గం లో ఉండి పని చేస్తున్నా పోలీసులు వారిని పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసిన ఆయన అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగారు.

పోలీసులతీరుకు నిరసనగా అర్దరాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆందోళన
పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ఆర్ వో కార్యాలయం ఎదుట, పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. గత నెల రోజుల నుండి, తనపై, తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మొదట చండూరులోని ఆర్వో కార్యాలయం ముందు బైఠాయించిన ఆయన అక్కడ ధర్నా నిర్వహించారు. ఆపై అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ కూడా ఆందోళన చేశారు.

ప్రచారం ముగిశాక కూడా నియోజకవర్గంలో స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని ఆరోపణ
ప్రచారం ముగిసిన తర్వాత కూడా బయట వ్యక్తులు నియోజకవర్గంలో ఉంటున్నారని. టిఆర్ఎస్ పార్టీ గుండాలు నియోజకవర్గంలో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు మేము నియోజకవర్గంలో ఉండే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. తాను రాజీనామా చేసింది మీరు కూడా ప్రజల కోసమని పేర్కొన్న ఆయన, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ ఫోన్ తియ్యటం లేదని అర్దరాత్రి కొనసాగిన రచ్చ
బయట వ్యక్తులు మునుగోడు నుండి బయటకు వెళ్ళేంత వరకు ధర్నా చేస్తామని పేర్కొన్న ఆయన పోలీసు అధికారులు, జిల్లా ఎస్పీ కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఆర్వో, జిల్లా కలెక్టర్ బయట వ్యక్తుల్ని వెంటనే పంపించాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించిన ఆయన, అవినీతి సొమ్ముతో మూటల కట్టలతో మునుగోడు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

కోమటిరెడ్డికి మద్దతుగా మహిళల ఆందోళనలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మహిళలు సైతం ఆందోళనలో పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్దతుగా బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. దీంతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications