చంద్రబాబు హింసిస్తున్నాడు, తిరగబడండి: కోమటిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ టీడీపీ నేతలు తిరగబడాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం అన్నారు. నాగార్జున సాగర్ నుండి తెలంగాణ జిల్లాల్లోని పొలాల రెండో పంటకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను బాబు హింసిస్తున్నారన్నారు.
చంద్రబాబు వైఖరి తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, కాబట్టి తెలంగాణ టీడీపీ నేతలు తిరగబడాలన్నారు. సాగర్ ఎడమ కాలువ నుండి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపి అయినా రెండో పంటకు నీరు లభించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టి సారించాలన్నారు. స్వైన్ ఫ్లూతో ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
మిషన్ కాకతీయ పథకానికి రూ.148 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో 201 చెరువుల పునరుద్ధరణ కోసం 148 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని 201 చెరువులను పునరుద్ధరించనున్నారు.
ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం
ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మంచిర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ దేశ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా ఆసుపత్రుల అభివృద్ధి కోసం రూ.2,280 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను మార్చి నెలలోపు ఖర్చు చేసి ఆసుపత్రులు అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. కార్పరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.