జనాలు అలా అనుకుంటున్నారు: కేసీఆర్పై కోమటిరెడ్డి ఆసక్తికరం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫాంహౌస్లో కూర్చొని అంతా బాగుంటుందంటే కురదని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం బీఏసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా వర్షాలు బాగా పడేవని, కరువు రాకపోయేదని జనాలు అనుకుంటున్నారని ఆయన అన్నారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మహారాష్ట్రతో ప్రాజెక్టుల ఒప్పందం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కొత్త జిల్లాల ఏర్పాటు, మైనార్జీ, గిరిజనులకు రిజర్వేషన్లు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన చర్చించాలని బీఏసీలో కోరామని చెప్పారు. కరువు పైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నా పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కోర్టుకు వెళ్లామని చెప్పారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు పైన కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బెదిరించి ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటున్నారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని తాము స్పీకర్ చుట్టు తిరిగామన్నారు.
కాగా, సోమవారం నాడు శాసనసభ మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాట్ సవరణ బిల్లు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజన బిల్లు, దేవాలయాల పాలక మండళ్ల సభ్యుల సంఖ్య పెంపు బిల్లులను సభ ఆమోదించింది.
ఈ మూడు బిల్లుల ఆమోదం కంటే ముందు జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. వచ్చే నెల 20 నుంచి పది పనిదినాలు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.