తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చేరికపై అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిజెపికి షాక్ ఇస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను బిజెపికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని, మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి కాదని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందుకే తాను మళ్లీ సొంత గూటికి చేరుకోబోతున్నానని సంచలన ప్రకటన చేశారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తనతో ఏమి చెప్పలేదని, తనతో ఎటువంటి చర్చ జరపలేదని పేర్కొన్న ఆయన, పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం అంటూ తెలిపారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు.
ఇక ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంచరీ కొట్టబోతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందని, కాంగ్రెస్ సునామీ నడుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గెలవడానికి డబ్బు అవసరం లేదంటూ పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తమ పార్టీని గెలిపించబోతున్నాయని స్పష్టం చేశారు. వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సునామీని ఎవరు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మొత్తంగా తన సోదరుడు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం విషయంలో తనతో ఎలాంటి చర్చ జరపలేదని, అది ఆయన వ్యక్తిగతమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications