పార్టీ మారే ఆలోచనలో కొండా దంపతులు ? .. బీజేపీలోకి జంప్ అంటూ ప్రచారం
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క ఇప్పటికీ పార్టీ ఫిరాయింపులతో శాసన మండలిలోనూ , శాసన సభలోనూ ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో దిద్దుబాటు చర్యలు లేవు. అంతే కాదు పార్టీలోనే నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీని మరింత దిగజారుస్తున్నారు. దీంతో ముఖ్య నాయకులు సైతం ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇక ఆ ప్రత్యామ్నాయం కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీనేనని భావిస్తున్నారు.
కొండా దంపతులు బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం .. కాంగ్రెస్ సంక్షోభమే కారణం
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపధ్యంలో కొండా దంపతులు కాంగ్రెసు పార్టీని వీడి బిజెపిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసిన కొండా సురేఖ చల్లా ధర్మారెడ్డిపై ఓటమి పాలయ్యారు. గతంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరి 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుండి విజయం సాధించారు కొండా సురేఖ . అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలతో ఉన్న అంతర్గత విబేధాలు కొండా సురేఖకు 2018ఎన్నికల సమయంలో ఇబ్బంది తెచ్చి పెట్టాయి. మొదటి జాబితాలో పేరు ప్రకటించకపోవటంతో కొండా దంపతులు టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరి ఎన్నికల్లో ఓడిపోయిన సురేఖ .. బీజేపీవైపు చూపు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని వీడి కాంగ్రెసులో చేరిన కొండా దంపతులకు గత ఎన్నికల్లో చుక్కెదురైంది. కాంగ్రెసులో చేరే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సైలెంట్ గా ఉంటున్న కొండా దంపతులు రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరనున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే బిజెపిలో చేరడానికి కొండా సురేఖ షరతు పెడుతున్నట్లు చెప్తున్నారు . తన కూతురు సుస్మితా పటేల్ కు భూపాలపల్లి శాసనసభ స్థానం కేటాయించాలని ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే సుస్మితా పటేల్ ను భూపాలపల్లి నుంచి బరిలోకి దింపాలని కొండా దంపతులు భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ప్రతికూల పరిస్థితుల మధ్య సురేఖ ఒక్కరే పోటీ చేసి పరాజయం పొందారు.
షరతు పెట్టిన సురేఖ ... బీజేపీలో సందిగ్ధం .. స్థానికంగా హాట్ టాపిక్
గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇక కొండా సురేఖ భూపాలపల్లి టికెట్ కోరటం , గండ్ర సత్యన్నారాయణ సైతం భూపాలపల్లి టికెట్ ఆశిస్తున్న నేపధ్యంలో కొంత సందిగ్ధత నెలకొందని సమాచారం . ఇక భూపాలపల్లి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన చందుపట్ల కీర్తి రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జంగా రెడ్డి కోడలు ఆమె ఓటమి పాలైనా పార్టీ కోసమే పని చేస్తున్నారు. ఇక ఈ టికెట్ విషయంలో బీజేపీకి క్లారిటీ వస్తే కొండా దంపతులు పార్టీ మారి బీజేపీకి జై కొట్టే అవకాశం వుంది అని స్థానికంగా చర్చ జరుగుతుంది.