బీఆర్ఎస్ కు కొత్త అర్ధం చెప్పి.. తల్లీ కవితా అంటూ కొండా సురేఖ చురకలు!!
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ నేతల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ కి కొత్త అర్ధం చెప్పిన కొండా సురేఖ
బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబరీ పార్టీ అని, దేశాన్ని దోచుకోవడం కోసం దేశం మీద పడుతుందని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాబరీ పార్టీ అని, తెలంగాణను దోచుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని కొండా సురేఖ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ అంతా పూర్తయిందని, అందుకే భారతదేశాన్ని దోచుకోవడానికి కెసిఆర్ ఫ్యామిలీ బయలుదేరిందని కొండా సురేఖ విమర్శించారు.
మేధావులు మాట్లాడాలని కవిత వ్యాఖ్యలకు సురేఖ చురకలు
ఇక ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడిన కొండా సురేఖ మేధావులు మాట్లాడాలని, దేశం కోసం పోరాటం చేయాలని కవిత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కానీ మేధావులు మాట్లాడడం, పత్రికలు పోరాడటం కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిందని పేర్కొన్నారు. కెసిఆర్ సీఎం అయిన తర్వాత మేధావులు మాట్లాడ్డం మానేశారు తల్లీ అంటూ కవితకు చురకలంటించారు.

జాగృతి సీబీఐ కేసుల నుండి తప్పించుకోవటానికేగా
సీబీఐ కేసుల నుండి తప్పించుకోవడానికి కవిత కొత్తగా జాగృతిని మళ్లీ రంగంలోకి దింపారని కొండా సురేఖ మండిపడ్డారు. కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కవిత కొత్త ఎత్తుగడలు వేస్తోందని కొండ సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. కవితకు మళ్లీ మేధావులు సడన్ గా గుర్తొచ్చారు అని ఎద్దేవా చేసిన కొండా సురేఖ, గతంలో తెలంగాణ కోసం మేధావులు పోరాటం చేసినట్టు మళ్లీ చేయాలని పిలుపునిస్తున్న కవిత తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది విద్యార్థులు, ప్రజలు పోరాటం చేసి, ప్రాణత్యాగం చేస్తే వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

దోపిడీ దొంగల్లా కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ
తెలంగాణ బిడ్డల బాధలు చూడలేక నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాగుపడింది మీ కుటుంబమేనని కొండా సురేఖ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ఫ్యామిలీ దోపిడీ దొంగల మాదిరిగా దోచుకున్నారని, ఇప్పుడు దేశం మీద పడ్డారని కొండా సురేఖ కవిత ను, కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. రాష్ట్రాన్ని నాశనం చెయ్యటం అయిపొయింది ఇప్పుడు దేశం మీద పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications