కేసీఆర్ పిలిచారు, అందుకే చేరుతున్నా, నన్ను మర్చిపోయే టైంలో: సురేష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేసీఆర్ తనను ఆహ్వానించారని, అందుకే తాను తెరాసలో చేరుతున్నానని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బుధవారం అన్నారు. కేటీఆర్ సమక్షంలో ఆయన తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయే సమయంలో తనతో పాటు కలసి రావాలని కేసీఆర్ పిలవడంతో టీఆర్ఎస్ పార్టీలో చెరానని చెప్పారు. భవిష్యత్ తరాల మంచి కోసమే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని వ్యాఖ్యానించారు.
కేసీఆర్తో తనకు 1989 నుంచి పరిచయం ఉందన్నారు. ఇద్దరం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ తనకు స్ఫూర్తి దాతగానే ఉన్నారన్నారు. ఆయన ఆలోచనలు తనను ఎప్పుడూ ఆకట్టుకునేవన్నారు. గత నాలుగేళ్ల కాలంలో కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందన్నారు.
చంద్రబాబు దుమ్ముదులిపిన కేటీ రామారావు
తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ కోరినప్పుడు ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. భావితరాల కోసమే పార్టీ మారినట్లు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పనితీరుతో తెలంగాణకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. సురేశ్ రెడ్డితో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండారి లక్ష్మారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తదితరులు తెరాసలో చేరారు.