పెళ్లికి రండి: కెసిఆర్ను కలిసి ఆహ్వానించిన కృష్ణ, విజయనిర్మల
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల సోమవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. హైదరాబాదులోని బేగంపేటలో గల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి వారు కెసిఆర్ను కలిశారు.
ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు కుమారుడి వివాహానికి రావాల్సిందిగా వారు కెసిఆర్ను ఆహ్వానించారు. వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని వారు కెసిఆర్కు విజ్ఞప్తి చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కుమారుడి వివాహం త్వరలో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరి హైమావతి మనవరాలు ప్రియాంకతో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కుమారుడు రత్నబాబుల పెళ్లి ఖరారైంది. ఈ మేరకు ఇరు కుటుంబాలు ఇప్పటికే ముహూర్తాలను కూడా నిర్ణయించుకున్నాయి. ఆదివారం హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని కలిసిన సూపర్ స్టార్ కృష్ణ, ఆదిశేషగిరిరావు వివాహా ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు.
ప్రియాంక ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేయగా, రత్నబాబు ఇప్పటికే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వ్యాపారం రంగంలో ఉన్నారు. కృష్ణ తన పెద్ద కూతురు పద్మజను వ్యాపార రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ కీలక భూమిక పోషిస్తున్న గల్లా అరుణకుమారి కుమారుడు, ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కు ఇచ్చి పెళ్లి చేశారు.