బాబు ఐనా అంతే:కేటీఆర్, విదేశాల్లో టీ కోసం(పిక్చర్స్)
హాంగ్కాంగ్/హైదరాబాద్: బాబు అయినా, వాళ్ల బాబు అయినా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆల్ ఇండియా రేడియోలో శ్రోతలతో అభిప్రాయాలు పంచుకున్నారు. రేడియో ద్వారా అనుభవాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో తన అభిప్రాయాలను రేడియో ద్వారా ప్రజలతో పంచుకోనున్నట్టు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా పని చేశామని, అధికారం బోనస్ అన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు. ఇంటింటికి నీళ్లు ఇస్తే దేశంలో తెలంగాణనే ఈ లక్ష్యం సాధించిన తొలి రాష్ట్రం అవుతుందన్నారు. మరోవైపు హాంగ్ కాంగ్ చేరుకున్న కేటీఆర్ పలువురితో భేటీ అయ్యారు.
కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతామని కేటీఆర్ చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉందన్నారు.
కేటీఆర్
ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా హాంగ్ కాంగ్, తైవాన్లలో కల్వకుంట్ల తారక రామారావు పర్యటిస్తున్నారు.
కేటీఆర్
గురువారం హాంగ్ కాంగ్ దేశంలోని పెట్టుబడిదారుల సమావేశంలో ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన దాదాపు 50 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
కేటీఆర్
ఈ కంపెనీల ప్రతినిధులే ప్రపంచంలో ఏ దేశంలో పెట్టుబడులు పెట్టాలనేది ఆ దేశ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశనం చేస్తారు. రానున్న రోజుల్లో కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.