సవాళ్లు ఎదుర్కొంటున్నాం-సత్తా చాటుతున్నాం: ఐఎస్బీలో కెటిఆర్
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను స్వీకరిస్తూ.. కొత్తరాష్ట్రంగా ఏర్పడిన సమయంలో ఉండే సవాళ్లను అధిగమిస్తూనే అభివృద్ధి, సంక్షేమంలో ప్రత్యేకతను చాటేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ఉద్ఘాటించారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిరంతరం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), భారత విదేశాంగ శాఖ సోమవారం ఐఎస్బీలో సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. 'ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీ; ఇండియా వర్సెస్ గ్లోబల్ ఎకానమీ; ఛాలెంజెస్ డెవలప్మెంట్' అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో పలు దేశాల రాయబారులు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ లక్ష్యాలు, ఉద్దేశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్న తీరును కేటీఆర్ వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, చైనాల్లో వయసు మీరిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటే భారతదేశం యువతరంతో ఉరకలెత్తుతున్నదని, దీంతో రాబోయే కాలంలో దేశం అగ్రపథంలో దూసుకుపోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించుకోవాలని ఇందుకోసం విద్యా, శిక్షణ, పోషకాహారం లాంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు.
పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు అవకాశాలను కల్పించడంపై మంత్రి తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఇప్పటికీ సగానికి పైగా భారతదేశంపనిసామర్థ్యం, వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, యువతను సేవారంగం వైపు మళ్లించాలని అన్నారు. తద్వారా టెక్నాలజీ, తయారీ, సేవా రంగాలతో కూడిన సమ్మిళితవృద్ధి సాధించాలని సూచించారు.
ఇందుకోసం పెద్దఎత్తున నైపుణ్యాభివృద్ధి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తే ఉపయోగకారిగా ఉంటుందన్నారు. కొత్తరాష్ట్రం అభివృద్ధికి ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను స్వీకరిస్తున్నట్టు పేర్కొన్న మంత్రి కేటీఆర్ టీఎస్ఐపాస్ను ఇందుకు ఉదాహరణగా చూపారు.
తెలంగాణ యువత రాజకీయంగా, సామాజికంగా ఎంతో పరిణతి సాధించి మరింత అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి మౌలికరంగ కార్యకలాపాలతో కనీస అవసరాలు తీర్చేందుకు క్రియాశీలంగా అడుగులు వేస్తున్నట్టు మంత్రి వివరించారు.
టీహబ్లో వినూత్న ఆవిష్కరణలు చేపడుతున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయబోయే టీవర్క్స్తో తయారీరంగంలో వినూత్న ఆవిష్కరణలను తీసుకొస్తామని, ఫైబర్గ్రిడ్తో ప్రతి పల్లెనూ అంతర్జాలంతో అనుసంధానిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అనేక పౌర సేవలను సాంకేతికంగా అనుసంధానం చేసి.. సులభతరం చేశామని కేటీఆర్ వివరించారు. ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్స్ వంటివాటిని ప్రారంభించి పౌరసేవలను సాంకేతికత అండగా ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.