కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చేతికి వచ్చిన పంట వర్షాల కారణంగా దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇక ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీల దృష్టి రైతులపైనే పడింది. రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతులకు అండగా ఉండటానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు రైతులకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతుందని పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని బిజెపి నేతలు రైతుల పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై స్వయంగా వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్లకు పంట సాయం పై వినతి పత్రాలను అందజేయాలని సూచించారు.

ప్రభుత్వం స్పందించకపోతే రైతుల కోసం బిజెపి తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండటానికి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఇక తాజాగా మంత్రి కేటీఆర్ కూడా రైతులకు అండగా ఉండాలని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు.
రైతుల కలిసి మాట్లాడే వారే కానీ, వారి సమస్యకు పరిష్కారం చూపే వారు కానీ, వారికి జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేవారు కానీ లేకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతులపై అన్ని రాజకీయ పార్టీలకు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందని రైతులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications