డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: కెటిఆర్, టిఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే
వరంగల్: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే.. వారిని చెప్పుతో కొట్టాలని ఐటి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రజలకు సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, హన్మకొండలో శుక్రవారం రోడ్ షో నిర్వహించారు.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయ్యాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేయ్యాలని అన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పారు. 50 ఏళ్లలో గత పాలకులు చేయని అభివృద్ధిని రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తామని చెప్పారు.
తెలంగాణలో రెండో అతి పెద్ద నగరంగా వరంగల్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. వరంగల్లో పరిశ్రమల విస్తరణకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఇప్పటికే నగరంలో సీఎం గల్లి గల్లీ తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు వరంగల్ నగరానికి చేసిందేమీ లేదని, వరంగల్ అభివృద్ధికి రూ. 1500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
మాదే విజయం: హరీశ్రావు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయమని హరీశ్ రావు అన్నారు. శుక్రవారం హరీశ్ రావు పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. వరంగల్ను మరో హైదరాబాద్లా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు హైదరాబాద్లో ప్రతిపక్షాలు మాయమయ్యాయన్నారు. ఓరుగల్లులో 58 డివిజన్లలో విజయఢంకా మోగిస్తాయని తెలిపారు.
వరంగల్కు సైనిక్స్కూల్, టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చినట్లు తెలిపారు. మిషన్భగీరథతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. వరంగల్లో నిమ్స్ తరహా ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఐదున్నర కోట్లతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కొండా సురేఖ చోరవతో మూడు మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఏప్రిల్ నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తామన్నారు. నిరంతర కరెంటు సరఫరాతో తెలంగాణ వెలిగిపోతోందని తెలిపారు. వరంగల్లోని చెరువులను గోదావరి జలాలతో నింపుతామని చెప్పారు. గెలుపు ఖాయమైంది... మెజార్టీయే తేలాలని అన్నారు.
టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
హైదరాబాద్: రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లిలో జరిగిన టిఆర్ఎస్ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ప్రకాశ్గౌడ్ను సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా టిఆర్ఎస్లో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్ను ఘనంగా సన్మానించారు.