కాకినాడ వెంకట్రావు ప్రాణాలు కాపాడిన కేటీఆర్: ఆస్పత్రికి ఫోన్ చేసి ఆరా
రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని మంత్రి కేటీ రామారావు తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు.
హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని మంత్రి కేటీ రామారావు తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు. సోమవారం మంత్రి కేటీఆర్ హెచ్ఐసీసీలో జరిగిన సమావేశానికి బయల్దేరారు.
అదే సమయానికి నోవాటెల్ హోటల్లో పనిచేస్తున్న కాకికాడకు చెందిన వెంకట్రావు హెచ్ఐసీసీ ప్రాంగణంలో బైక్ పై నుంచి పడి గాయపడ్డారు. అది చూసిన కేటీఆర్ వెంటనే తన ఎస్కార్ట్ వాహనంలో వెంకట్రావును ఆసుపత్రికి తరలించారు. తమ సిబ్బందిని అతని వెంట పంపించి ఆసుపత్రిలో చేర్పించారు.
వైద్యులకు ఫోన్ చేసి సరైన చికిత్స అందించాలని సూచించారు. రెండు మూడు సార్లు వెంకట్రావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం గమనార్హం. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వెంకట్రావుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
కేటీఆర్ స్పందనపై వెంకట్రావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కూడా ఓ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.