నాకు మంత్రి పదవే ఎక్కువ.. ఇక సీఎం పదవా, రాముడికే బిజెపి శఠగోపం: కెటిఆర్
హైదరాబాద్: తనకు మంత్రి పదవే ఎక్కువ అని, ముఖ్యమంత్రి పదవి పైన ఎలాంటి ఆశ లేదని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. మీట్ ది ప్రెస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కలలో కూడా సీఎం కావాలని కోరుకోలేదన్నారు. తనకు మంత్రి పదవే చాలా ఎక్కువని, ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే మంత్రి పదవి వచ్చిందన్నారు. బీజేపీ పార్టీ పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జోక్ పార్టీ అన్నారు.
రామమందిరం కడతామని రాముడికే కమలం పార్టీ శఠగోపం పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు. ఆయన అన్ని రాష్ట్రాలకు ప్రధాని అని, ఇంతవరకు తెలంగాణకు రాకపోవడం శోచనీయమన్నారు.
అందువల్లే బీజేపీ నేతలను నిధులు తీసుకురమ్మని ప్రజల కోసం అడుగుతున్నామని చెప్పారు. ఇందులో ఎలాంటి తప్పులేదనుకుంటున్నానని చెప్పారు. విభజన జరగకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రావడం వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు.
ఎంతమంది సినిమా స్టార్లు వచ్చినా కెసిఆర్ తమ పార్టీకి పెద్ద గ్లామర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మేయర్ పదవి మజ్లిస్ పార్టీకి ఇస్తామని అసత్య ప్రచారం చేస్తున్నారని, తాము ఎవరి పైన ఆధారపడకుండా గ్రేటర్ పీఠం గెలుస్తామన్నారు. నెలకు రూ.50వేల వేతనంకు తక్కువ ఉంటే హౌసింగ్ స్కీం ఆలోచిస్తున్నామన్నారు.
హైదరాబాద్కు ఏం చేశారో చెప్పాలి: ఎల్ రమణ
తెరాస హైదరాబాదుకు ఏం చేసిందో చెప్పారని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ మంత్రి కెటిఆర్ను ప్రశ్నించారు. హైదరాబాదుకు ఏం చేశారనే విషయం కెటిఆర్ సూటిగా చెప్పాలన్నారు. బిజెపి, టిడిపిల పైన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కెటిఆర్ వ్యాఖ్యలకు టిడిపి కౌంటర్ ఇచ్చింది. కెటిఆర్ రాజీనామా చేయడం తర్వాత అని... టిడిపి నుంచి తెరాసలోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ చేశారు. హైదరాబాదును సీమాంధ్రులే అభివృద్ధి చేశారన్నారు. తెరాస గెలిస్తే మజ్లిస్ అజెండా అమలు చేస్తుందని బిజెపి శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ అన్నారు.