గ్లోబరీనా తెలియదనడం ఓ జోక్..! ఐటీ మంత్రిగా ఉన్నప్పటినుండే సంబంధాలు..!కేటీఆర్ గుట్టు విప్పిన రేవంత్
హైదరాబాద్ : గ్లోబరీనాతో కేటీఆర్ కు ఉన్న అనుబంధం రోజుకోమలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాల పట్ల రేవంత్ తనదైన శైలిలో స్పందించడంతో వ్యవహారం రసపట్టులో పడింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్లోబరీనా గురించి తెలియదంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్పై విమర్శల వర్షం కురిపించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను పక్కన పెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనాలకు టెండర్లు కట్టబెట్టారన్నారు. ఇదంతా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందన్నారు రేవంత్ రెడ్డి.
ఇంటర్ వ్యవహారంలో అన్నీ అవకతవకలే..! కేటీఆర్ గ్లోబరీనా తెలియదనడం హాస్యాస్పదమన్న రేవంత్..!!
ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం 1996లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఏర్పాటైందని, అప్పట్లో పరీక్షల ప్రకటన, ముద్రణ, ఫలితాలు మూడు సంస్థలకు అప్పగించేవాన్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. కానీ 2016లో అన్నిటినీ కలిపి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్కు కట్టబెట్టారన్నారు. ఆ సమయంలోనే ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్నారు రేవంత్ రెడ్డి.
తప్పులు చేసిన వారిపై ప్రభుత్వం ఉదాసీనత..! చర్యలు ఎందుకు తీసుకోలేదన్న రేవంత్ రెడ్డి..!!
దీనిపై సీబీసీఐడీకి కేసు అప్పగించినా, ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని విమర్శించారు. ప్రధాన నిందితులు ఇద్దరూ చనిపోయారని తెలిపారు. ఒకరు కస్టడీలో చనిపోగా, మరొకరు ప్రమాదవశాత్తు చనిపోయారని ... ఆ రెండూ అనుమానాస్పద మరణాలే అన్నారు రేవంత్. దీనిపై ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించిన మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్కు చెందిన విజయ రావు, ప్రద్యుమ్నలపై ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
గ్లోబరీనా నిర్వాకం వల్ల 23 మంది చనిపోయారు..! కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..!!
అంతే కాకుండా గ్లోబరీనా, మ్యాగ్నటిక్ సంస్థలూ రెండు భాగస్వామ్య సంస్థలని, దుర్మార్గంగా 23 మంది చావులకు కారణమయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. కంపెనీల పేర్లు వేరు గానీ వ్యక్తులంతా ఒక్కటేనని చెప్పుకొచ్చారు. కలిసి వ్యాపారం చేస్తున్నారని అన్నారు.. కాకినాడ జేఎన్టీయూ వీరిపై క్రిమినల్ కేసులు పెట్టిందని, మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థ నిషేధిత సంస్థ అన్నారు. అంతే కాకుండా గ్లోబరీనాకు టెండర్లు ఇవ్వడంలోనే వాళ్ల ఉద్దేశం దాగుందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కేటీఆర్ కు అంతా తెలిసే జరిగిందన్న రేవంత్..! సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్..!!
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు వేశారని, కేటీఆర్ ఎవరిని మభ్య పెడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై పెద్ద కుట్ర జరిగుందని, రాష్ట్రంలో 10 లక్షల మంది ఇంటర్ చదువుతున్నారని. ఒక్కో విద్యార్థిపై కనీసం లక్ష ఖర్చుపెడుతున్నారని, ఏటా పది వేల కోట్ల రూపాయల వ్యాపారం మని వివరించారు. విద్యార్థుల డేటాను ప్రైవేటు సంస్థలకి ఇచ్చారని, అందుకు నిబంధనలు ఒప్పుకోవని, కార్పొరేట్ కాలేజీల మాఫియా, దోపిడీకి తార్కాణం ఇదేనని తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి మండిపడ్డారు.