నిర్లక్ష్యం వీడండి: ప్రజలకు కేటీఆర్, 'ఫోన్లు పక్కన పెడితే కొంపలు మునిగిపోవు'
హైదరాబాద్: మన నగరాన్ని మనమే పరిరక్షించుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులే అన్ని చేస్తారని అనుకోవడం సరికాదని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ సిగ్గుపడలేదు, నాకు కనువిప్పు కలిగింది, థ్రిల్ అయ్యా: వర్మ
ఆయన కుత్బుల్లాపూర్ సర్కిల్లో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన నగరం తొలి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పురపాలక విభాగంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని కోరారు. ప్రజల ఆలోచనల సమాహారంగా భవిష్యత్ ప్రణాళికలు ఉండాలన్నారు.
ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడాలి
ప్రజలు నిర్లక్ష్య వైఖరిని వీడాలని కేటీఆర్ అన్నారు. స్వచ్ఛత అనేది అందరి బాధ్యత అని చెప్పారు. నగరం నాది, మనది అనే సామాజిక స్పృహతోనే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందని చెప్పారు. స్వచ్ఛ నమస్కారం అని తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
సమస్యల అధ్యయనం, పరిష్కారంతో
సమస్యల అధ్యయనం, పరిష్కారంతో పాటు ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా నడవడమే మన నగర కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు. నిజాయితీగా చిత్తశుద్ధితో సమస్యల పరిష్కార వేదిక మన నగరం అన్నారు. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అన్నారు. ఈ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి స్లమ్ లెస్ సిటీ, ఎంఆర్డిపి, స్వచ్ఛత, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర ఎన్నో మెగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాకముందు ఇలా, ఇప్పుడు ఇలా
తెలంగాణ రాకముందు హైదరాబాద్ నగరంలో వారానికి రెండు రోజులు విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు, తాగునీటి కొరత వంటి సమస్యలు ఉండేవని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సంవత్సరంలోపే ఈ సమస్యలన్నింటిని దూరం చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే మెరుగైన పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్లకు మరిన్ని అదనంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమన్నారు.
ప్రతి పని డబ్బుతో సాధ్యం కాదు, ఎన్నికలు లేవు
ప్రతి పని డబ్బులతో సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఎన్నో ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. దీనికి నిదర్శనం హైదరాబాద్ నగరంలోని అనేక స్వచ్ఛ కాలనీలు అన్నారు. మన నగరం కార్యక్రమానికి రాజకీయ ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవన్నారు.
కొంపలు మునిగిపోవు
కాగా, సభలో అధికారులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. సెల్ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలని, రెండు గంటలు ఫోన్లు పక్కన పెడితే కొంపలు మునిగిపోవని, ప్రజాప్రతినిధులు, అధికారులతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరు ఫోన్లు పక్కన పెట్టాలన్నారు.