సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేది: ఓటమిపై కేటీఆర్ స్కానింగ్ రిపోర్ట్..!!
KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అధిగమించిన భారత్ రాష్ట్ర సమితి.. లోక్సభ రేసుపై దృష్టి సారించింది. అసెంబ్లీ బరిలో ఎదురైన పరాజయాన్ని ఇక్కడ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దీనికి సారథ్యాన్ని వహించారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనా చారి, ఎంపీ బీబీ పాటిల్.. హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఎవరూ నిరాశ చెందనక్కర్లేదని, మూడింట ఒకవంతు సీట్లను గెలిచామని అన్నారు. జుక్కల్లో హన్మంతు షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని, 1,100 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు.
స్థానికేతరుడైన కాంగ్రెస్ అభ్యర్థి జుక్కల్లో గెలిచారని, నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చి జుక్కల్లో విజయం సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. నిజాం సాగర్ మండలం మొత్తానికీ దళిత బంధు నిధులను మంజూరు చేశామని, అయినప్పటికీ మిగిలిన వర్గాలు ఓట్లు పార్టీకి పడలేదని విశ్లేషించారు.
ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడుతున్నారని, సమాజం అలా తయారైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఓటమి చవి చూసినా ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం ఏ మాత్రం చెక్కు చెదర లేదని అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అనే పదాన్ని సైతం ఉచ్ఛరించడానికి ఇష్టపడేది కాదని, దాన్ని నిషేధించిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడింది, కొట్లాడేది కూడా బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ అనే పదం మాయమౌతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ఠను మూటగట్టుకుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసనలు మొదలయ్యాయని కేటీఆర్ చెప్పారు. అప్పులను బూచిగా చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్- కాంగ్రెస్- బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్కు దూరమైన సామాజిక వర్గాలు ఈ లోక్సభ ఎన్నికల్లో తమ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాంటి పొరపాటు లోక్సభ ఎన్నికల్లో జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేసిన వాళ్లు ఇపుడు పునారాలోచనలో పడ్డారని, అధికార పార్టీ ఇచ్చిన బూటకపు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
జిల్లాల సంఖ్య తగ్గించడానికి ప్రత్యేకంగా కమిషన్ను వేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరని కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి తిరోగమన చర్యలపై ప్రజల్లో పోరాడాలని అన్నారు. తెలంగాణ పురోగమనాన్ని అడ్డుకునే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications