Munugodu By Election: అసంతృప్త నేతలతో కేటీఆర్ భేటీ..! అందరూ సహకరించాలని ఆదేశం..
మునుగోడులో రాజకీయ వేడి పెరుగుతోంది. శుక్రవారం నుంచి నామిషన్లు ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో ఎన్నికల సందడి నెలకొంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతుండగా.. కాంగ్రెస్ నుంచి దివంగత నేత, మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. తాజాగా టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంలో స్థానికంగా కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చెయ్యొద్దని ఇప్పటికే అధిష్ఠానికి చెప్పారు. కానీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని అధిష్ఠానం ప్రభాకర్ రెడ్డినే ఫైనల్ చేసింది. దీంతో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ అసంతృప్త నేతలతో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.
స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, సర్వే రిపోర్టుల వివరాలను అసంతృప్త నేతలకు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని సర్వే చేసి తెలుసుకున్నాకే అభ్యర్థిని ఎంపిక చేసినట్లు వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడేలా అసంతృప్త నేతలకు కేటీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి,మాజీ ఎంపీ బుర నర్సా గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.