(పిక్చర్స్) మీరు నాకు ఆశలు కల్పించొద్దు: 'సీఎం పదవి'పై కెటిఆర్, దుమ్మెత్తి పోశారు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని, వంద స్థానాలకు తక్కువ గెలుచుకోమని లేదంటే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేసిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన విపక్షాల నుంచి గట్టి కౌంటర్, విమర్శలు వచ్చాయి.
కెటిఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సీట్ల విషయంలో జోక్ చేసినట్లుగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సవాల్ చేస్తే తాము మాట్లాడుతామని, కెటిఆర్ వ్యాఖ్యల పైన స్పందించమని బిజెపి - టిడిపిలు కౌంటర్ ఇచ్చాయి.
మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరినప్పుడు ఎందుకు స్పందించలేదని కాంగ్రెస్ పార్టీ కెటిఆర్కు షాకిచ్చింది. గెలవలేక ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి గ్రేటర్ అధ్యక్షులు మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ.. కెటిఆర్ సవాల్ అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ... కెటిఆర్ సవాల్కు స్పందించాల్సిన అవసరం లేదని, వంద సీట్ల పైన కెసిఆర్ సవాల్ చేయగలరా అని నిలదీశారు.
టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మేయర్ పీఠం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీదేనని, కెసిఆర్ సవాల్ చేస్తే స్పందిస్తామమని చెప్పారు. నాడు కోమటిరెడ్డి సవాల్ పైన కెటిఆర్ ఎందుకు స్పందించలేదని దాసోజు శ్రవణ్ కుమార్ పాయింట్ లేవనెత్తారు.
కెటిఆర్
జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయలేకపోతే నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, టిఆర్ఎస్ గెలిస్తే విపక్ష పార్టీల నేతలు రాజీనామా చేస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. మజ్లిస్తో పాటు ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఒంటరిగానే 100 డివిజన్లు గెలిచి పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కెటిఆర్
సోమవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెరాసను తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, వచ్చే మార్చిలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారముందన్న ప్రశ్నపై స్పందిస్తూ.. కలలో కూడా తనకు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదన్నారు.
కెటిఆర్
ఎన్నికలకు కొన్ని నెలల ముందు నెలకొన్న అనిశ్చితి సమయంలో రాష్ట్రం సిద్ధిస్తే చాలనుకున్నామని, ప్రజల ఆశీర్వాదానికి తోడు అవకాశం కలిసి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, వ్యక్తిగత అర్హతలతో చూస్తే తనకు మంత్రి పదవే ఎక్కువేనని, కేసీఆర్ మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, తనకు లేనిపోని ఆలోచనలు కల్పించవద్దన్నారు.
కెటిఆర్
తెరాసను తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుతామని తాను సరదాగా అన్న వ్యాఖ్యలపై రాజకీయం చేయడం సమంజసంగా లేదన్నారు. ప్రత్యర్థి పార్టీలతో పోల్చితే తెరాసకు సినీ గ్లామర్ తగ్గిందన్న ప్రశ్నకు.. తెలంగాణలో కేసీఆర్ను మించిన గ్లామర్ ఎవరికీ లేదన్నారు. మతం రంగును పులిమి మరోసారి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్న బిజెపి... భారతీయ జోక్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
కెటిఆర్
ఏనాడో వాగ్దానం చేసిన రామమందిర నిర్మాణం ఏమైందో ఒక్కసారి ఆలోచించుకోవాలని, దేవుడినే మోసం చేసిన ఆ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల్ని ముక్కుపిండి వసూలు చేస్తామని, అవి వాళ్లు వూరకే ఇచ్చేవేంకాదన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తున్న ప్రధాని మోడీ అడిగి జీహెచ్ఎంసీ అభివృద్ధికి లక్ష కోట్లు ఇప్పించాలని బిజెపికి సూచించారు.