ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ సంచలనం: కేంద్రానికి సవాల్, అరవింద్కు హెచ్చరిక
దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరారు.
నిజామాబాద్: బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దమ్ముంటే, చేతనైతే తెలంగాణ రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద సాధించుకుని రావాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు సవాల్ విసిరారు. పెద్దాయన(డీఎస్) కుమారుడు కాబట్టే అరవింద్ను ఏమి అనట్లేదని కేటీఆర్ చెప్పారు.
ముందస్తు ఎన్నికలపై కేంద్రానికి కేటీఆర్ సవాల్
నిజామాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రామలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఎవరేందో ప్రజలే తేలుస్తారని అన్నారు. ఫిబ్రవరి 1న పెట్టబోయే బడ్జెట్ మోడీ సర్కారుకు చివరిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవర్ని కుబేరులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
పెద్దాయన కొడుకునే..: అరవింద్కు కేటీఆర్ వార్నింగ్
పొద్దన్న లేస్తే కేసీఆర్ ను, మంత్రులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని బీజేపీ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. తాము కూడా అంతకుమించి విమర్శలు చేయగలమని అన్నారు. ఇకనైనా సభ్యతతో మాట్లాడాలని.. ఒక పెద్ద మనిషి కొడుకువు అని.. డీ శ్రీనివాస్ అంటే మా అందరికీ గౌరవం ఉందన్నారు కేటీఆర్. పెద్దాయన కొడుకువనే ఊరుకుంటున్నామని చెప్పారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉంటాలంటూ నేతలకు కేటీఆర్ పిలుపు
తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు కేటీఆర్. బుద్ధి లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అప్పులు చేశారని ఆరోపిస్తున్నారు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేయడం లేదా? అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవిష్యుత్తు కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు కేటీఆర్. నిజామాబాద్ నుంచే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యే, ఎంపీలు గెలవాలని సూచించారు. ముందుస్తు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ హింట్ ఇచ్చారా? లేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? అనేదానిపై చర్చ సాగుతోంది.