11 రోజులు అన్నం తినలేదన్న పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సంచలనం
హైదరాబాద్: ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్న చందంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రకే పరిమితమవుతుందని శుక్రవారం కాకినాడ సభలో చేసిన ప్రసంగం ద్వారా తెలుస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్, మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
శనివారం హైదారాబాద్లో ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'పవన్ కల్యాణ్ ఏపీ విభజన జరిగాక 11 రోజుల అన్నం తినలేదట.. తెలంగాణ ప్రజలకి ఆ మాట బాధ కలిగించదా?' అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారే తప్పా, హోదా కోసం పోరాడడం లేదని వ్యాఖ్యానించారు.
హోదా సాధన విషయంలో అందరం కలిసి సాధించుకుందామనే ధోరణిలో వారు లేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీకి హోదా కోసం పోరాటం చేసే ప్రయత్నంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. హోదాతో వచ్చే ప్రయోజనాలను ఆంధ్రా పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయని ఆయన అన్నారు.

నిలకడలేని రాజకీయాలతో లాభం లేదని ఆయన అన్నారు. ఏపీకి ఏం కావాలో అక్కడి నాయకుల్లోనే స్పష్టత లేదని చెప్పారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటా, హోదాపై ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. అంతేకాదు ఏపీకి పూర్తి స్థాయి న్యాయం చేయగల ఏకైకపార్టీ టీఆర్ఎస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్కు టీఆర్ఎస్ న్యాయం చేయగలదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కారణంగా ఏపీకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని అన్నారు. 'విద్యాసంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ప్యాకేజీలు, హోదాలు ఇలా ఎన్నో ప్రయోజనాలను ఏపీ సొంతం చేసుకుందంటే అందుకు కారణం టీఆర్ఎస్ పార్టీ కాదా' అని అన్నారు.












Click it and Unblock the Notifications