మా అయ్య తెలంగాణ తెచ్చిన మొనగాడు - బరాబర్ చెబుతున్నా, ఇక..!!
తెలంగాణ రాజకీయాల్లో డైలాగ్ వార్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. వాటికి కౌంటర్ గా రేవంత్ చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య కొత్త విమర్శలకు కారణమయ్యాయి. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన తండ్రి పేరు చెప్పుకోవటంలో తప్పేంటని ప్రశ్నించారు. తాను గుంటూరు లో చదివితే రేవంత్ కు వచ్చిన బాధేంటని నిలదీసారు. రేవంత్ అల్లుడుది ఆంధ్రా కాదా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల పైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు. తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కు బాధ ఏంటని. తాను గుంటూరులో ఇంటర్ చదువుకున్నానని.. తన అల్లుడు ఆంధ్రోడే కదా అని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మా అయ్య మొగోడు.. తెలంగాణ తెచ్చిన మొనగాడు అని కేటీఆర్ అన్నారు.

మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు చెప్పుకోరు అని విమర్శించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని అన్నారు.
పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని తెలిపారు. 10 శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడిగారు.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి కోపమొస్తుందని అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని సోనియాగాంధీ మీద రేవంత్ రెడ్డి ఒట్టువేశాడని తెలిపారు. మహిళలకు రూ.2500 ఇస్తానని ప్రియాంక గాంధీ మీద ఒట్టు వేశాడని గుర్తుచేశారు. ఇవన్నీ ఎగవేసి.. ఇప్పుడు కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే బడ్జెట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేస్తున్నాడని తెలిపారు. జనవరి 1 నుంచి మహిళలకు రూ.2500 ఇస్తానని శపథం చేయాలని సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications