మోడీ, ఈడీలకే కాదు.. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్న కేటీఆర్
తాను ఏ కేసులకూ భయపడేది లేదని తేల్చి చెప్పారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం శాసనసభ సమావేశాల అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు చెప్పని విధంగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారన్నారు. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ధ్వజమెత్తారు.
తాము రైతుబంధు అమలు చేసిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ సర్కారు రెండో విడత రైతుబంధు ఇవ్వడం లేదని అన్నారు. రైతుబంధు ఎగ్గొట్టేందుకే కేబినెట్ సబ్ కమిటీ అని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కరు డొల్లతనం బయటపడిందన్నారు. సీఎం 100 శాతం రుణమాఫీ అయ్యిందంటే.. వాళ్ల ఎమ్మెల్యేలే 70 శాతం అమలైందని అంటున్నారని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని కేటీఈర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని.. రైతుబంధు కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. వీటిపై తాము అడిగితే సీఎం రేవంత్ రెడ్డికి కోపం వస్తుందన్నారు. ప్రభుత్వం చెప్పే కాకి లెక్కలు తాము నమ్మడం లేదన్నారు. రూ. 26,775 కోట్లు రైతు భరోసా రైతులకు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్.
మాజీ సీఎం కేసీఆర్ను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్కు గౌరవిమస్తే.. తాము సీఎంకు గౌరవిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమని అన్నారు. ఈడీకి భయడం.. మోడీకి భయపడమంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని.. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడగు వేయమని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications