ముందస్తుకెళ్లిన వారు ఎవరూ గెలవలేదు, కేసీఆర్ రికార్డ్స్ సృష్టిస్తారు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సభకు ఫెడరల్ ఫ్రంట్ నేతలను కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Recommended Video
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రగతి నివేదన సభ ముందస్తు కోసం పెడుతున్న సభ కాదని చెప్పారు. ప్లీనరీలోనే కేసీఆర్ ఈ సభ గురించి చెప్పారని అన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసే విషయమై అడగగా.. బీజేపీతో తమకు భావసారూప్యత లేదని చెప్పారు.
టీడీపీ మంత్రులే పొత్తు వద్దంటున్నారు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దని ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ మంత్రులే చెబుతున్నారని అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు తమ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు.
కేసీఆర్ రికార్డ్స్ సృష్టిస్తారు
చరిత్రలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ పార్టీ కూడా గెలిచిన దాఖలాలు లేవని అడగ్గా.. కేసీఆర్ రికార్డులు సృష్టిస్తుంటారని, ఇప్పుడు కూడా గెలిచి రికార్డులు సృష్టిస్తారని అభిప్రాయపడ్డారు. ముందస్తు వస్తుందని కేటీఆర్ స్పష్టంగా చెప్పలేదు. ముందస్తు జరిగినా, నిర్దిష్ట సమయంలో జరిగినా గెలుపు మాత్రం తమదే అన్నారు.
ముందస్తు వస్తే మంచిదే
ముందస్తు వస్తే మంచిదేనని కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ముందస్తుకు వెళ్లిన వారికి ఓటమి తప్పలేదన్నారు. విపక్షంలో అసంతృప్తివాదులు ఉన్నా యుద్ధంలో అందరూ ఒకటవుతారని చెప్పారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందనే ముందస్తు అన్నారు.
మోడీతో మిత్రుత్వం దాచేందుకు కేసీఆర్ ప్రయత్నం
ప్రధాని నరేంద్ర మోడీతో మిత్రుత్వాన్ని దాచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని జైపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఎవరు ప్రచారం చేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జైపాల్ ప్రధాని మోడీని ఫ్రెంచ్ పాలకుడు 14వ లూయీతో పోల్చారు. లూయీ మాదిరిగానే నేనే రాజు.. నా నిర్ణయమే శిరోధార్యం అనేలో మాడీ తీరు ఉందని చెప్పారు. రాఫెల్ డీల్లో ప్రధాని మోడీ ఇష్యానుసారంగా వ్యవహరించారని జైపాల్ అన్నారు.