మే ఏడో తారీఖున వరంగల్ కు కేటీఆర్.!ఏర్పాట్లను సమీక్షించిన ఎర్రబెల్లి.!
వరంగల్/హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం చింతల పల్లి కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. టెక్స్టైల్ పార్క్ స్థలాన్ని, పరిశ్రమ పని చేస్తున్న విధానాన్ని, ఉత్పత్తితో పాటు అక్కడి అవకాశాలు వంటి పలు అంశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
టెక్స్టైల్ పార్క్ అధికారులతో మాట్లాడి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏవిధంగా ఉన్నాయో మంత్రి అడిగి తెలుసుకున్నారు. మెగా పార్క్ నిర్మాణానికి స్థలాలను ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి ఎకరాకు వంద గజాల స్థలం పార్క్ లోపలే ఇస్తున్నామని, త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేస్తారని, ఈ విధంగా దాదాపు 48 మంది రైతులకు పునరావాసం లభించనుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గతంలో వరంగల్ లో అజంజాహి మిల్లు ద్వారా అనేకమందికి ఉపాధి లభించేదని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ మిల్లు మూతపడిందని, చివరకు ఆ మిల్లు స్థలాలను కూడా అమ్ముకున్న గత చరిత్రను మరిచిపోయే విధంగా సీఎం చంద్రవేఖర్ రావు దిశానిర్దేశంలో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని కైటెక్స్ మెగా టెక్స్టైల్ కంపెనీ వరంగల్ కు వచ్చే విధంగా కృషి చేశారన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
టెక్స్టైల్ మెగా పార్క్ వరంగల్ తెచ్చిన సీఎం చంద్రవేఖర్ రావు, మంత్రి కేటీఆర్ లకు వరంగల్ ప్రజలు రుణపడి ఉంటారన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కు ఈ నెల 7 వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని అన్నారు. కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి అయితే ఇక్కడి నిరుద్యోగ యువత కు మంచి ఉపాధి లభిస్తుందిని, 2500 మందికి ప్రత్యక్షంగా అంతకు తగ్గని విధంగా పరోక్షంగా అనేక మందికి ఈ కంపెనీ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.