వాళ్లే అవాక్కయ్యారు, జగన్ తప్ప: చంద్రబాబుపై కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు గురువారం నిప్పులు చెరిగారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.
బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్, మోడీకి ఈ గుండెల్లో చోటు లేదు
ఈ సందర్భంగా ఆయన మొదట మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడాలని, నేను తెలుగులో సమాధానం చెబుతానని, మీరు హిందీలో, ఇంగ్లీష్లో రాసుకోవచ్చునని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ లేదు, వైసీపీ తప్ప
చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని పార్టీ అంటూ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. ఆయన ఒంటరిగా పోటీ చేసిన సందర్భం లేదన్నారు. స్వయం ప్రకాశం లేని చంద్రుడు ఈ దేశంలో ఉన్నది ఎవరైనా అంటే అది చంద్రబాబు అన్నారు. ఊసరవెల్లి సిగ్గుపడేలా రంగులు మారుస్తారని, ఆయన తీరు సిగ్గుచేటు అన్నారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేవారు కూడా అవాక్కయ్యారు
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వారే తమ పాలన చూసి అవాక్కయ్యారని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు తన డబ్బా తానే కొట్టుకుంటున్నాడని చెప్పారు. దర్బారు పెట్టి మీడియాలో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన పరిపాలన అనిపించుకోదన్నారు. తమకు పాలన చేతకాదని చెప్పారని, కానీ తలెత్తుకొని తిరేగాలా పాలించామన్నారు. నవ తెలంగాణ లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
మాకు చేతకాదన్నారు కానీ
1956 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా మినహా ఒక్క కొత్త జిల్లా ఏర్పాటు కాలేదని కేటీఆర్ చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ కోసమే తెరాస ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చామన్నారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని ప్రచారం చేశారని, తలెత్తుకొని చెప్పుకొనే విధంగా పాలించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలిచిందన్నారు.
కర్ఫ్యూలేని పాలన
రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం రూ.39.04 కోట్లు అని, నాలుగేళ్ల తెరాస పాలనలో సగటున ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. తెరాస పాలనలో హైదరాబాదులో కర్ఫ్యూ అనేది లేకుండా చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీలాగా తాము ఆపద మొక్కులు మొక్కమని కేటీఆర్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు అని టీడీపీ చెబుతోందని, దానికి తమకు అభ్యంతరం లేదని తెరాస నేత వినోద్ వేరుగా అన్నారు. రాహుల్ గాంధీకి 25 ఎంపీ సీట్లు కావాలని చెప్పారు. కానీ తెలంగాణలో 17 మాత్రమే ఉన్నాయని చెప్పారు. అందుకే ఏపీతో రాహుల్ గాంధీ ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ మధ్య చీకటి ఒప్పందం బయటపెట్టాలన్నారు. కూటమి ఓ విఫల కూటమి అన్నారు.