సీఎం కేసీఆర్ తో మాజీ సీఎం భేటీ : పొత్తుల పై కీలక చర్చలు..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. విజయ దశమి రోజున సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రకటన సమయంలోనే జెండా - అజెండా ప్రకటించే దిశగా కసరత్తు జరుగుతోంది. తమది థర్డ్ ఫ్రంట్ కాదని..మెయిన్ ఫ్రంట్ గా చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు...సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ముందుకు రావాలంటూ తీర్మానాలు చేసారు. మద్దతు ప్రకటించారు.

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్దం
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి తీర్మానాల ను పంపేందుకు సిద్దమయ్యారు. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవాళ ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి... మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో చర్చించారు.
ఇప్పటికే 22 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఉచిత విద్యత్ అంటూ సంచలన ప్రకటన చేసారు. ఈ ప్రకటన జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. జాతీయ స్థాయిలో నితీష్.. కేజ్రీవాల్..అఖిలేష్ యాదవ్.. తేజస్వి యాదవ్.. లాలూ ప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు.

కుమార స్వామితో కీలక భేటీ
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తోనూ చర్చలు జరిపారు. ఇప్పుడు కుమార స్వామి హైదరాబాద్ కేంద్రంగా సీఎం కేసీఆర్ తో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి దింపుతామని శపథం చేసిన కేసీఆర్.. ఈ భేటీలో కీలక అంశాల పైన చర్చ చేసే అవకాశం ఉంది.
త్వరలో కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో ఫోకస్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సోమ..మంగళవారం అసెంబ్లీలోనూ కేంద్రం తీరు పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

పార్టీ జెండా - అజెండా ఖరారు
ఇక, జాతీయ పార్టీలో ఏ అంశాల ఆధారంగా ముందుకు వెళ్లాలనే దాని పైన ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే పార్టీలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ లో తనతో కలిసి ప్రయాణం చేసిన వారిలో కొందరిని సీఎం ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. కుమార్తె కవితకు జాతీయ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ వరుస నిర్ణయాలు.. కీలక నేతలతో భేటీల ద్వారా జాతీయ స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications