సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని - హైడ్రామా నడుమ ఓటింగ్..!!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. కూనంనేని మాజీ ఎమ్మెల్యేగా.. పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం చివరి వరకూ పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు. ఇద్దరు నేతలూ పట్టువీడకపోవడంతో హైడ్రామా నడుమ ఓటింగ్ నిర్వహించారు. చివరకు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నికపై అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగాయి.
ఎన్నిక లేకుండానే కార్యదర్శిని ఎంపిక చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేసారు. బరిలో నిలిచిన ఇద్దరూ పట్టువీడకపోవడంతో హైడ్రామా నడుమ ఓటింగ్ నిర్వహించారు. కూనంనేనికి 59, పల్లా వెంకట్రెడ్డికి 45 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. గతంలో కూనంనేని ఎమ్మెల్యేగా .. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్విగా చాడ వెంకట రెడ్డి రెండు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సీపీఐ పార్టీ నిబంధనల ప్రకారం మూడు సార్లు మాత్రమే కార్యదర్శిగా ఒకే వ్యక్తి కొనసాగే అవకాశం ఉంటుంది.

మూడోసారీ తనకే అవకాశం ఇవ్వాలని చాడ కోరినట్లు తెలిసింది. అయితే ఈసారి తనకు అవకాశం కల్పించాలని కూనంనేని పట్టుబట్టినట్లు సమాచారం. ఇది ఇద్దరి మధ్య పోటీకి దారితీసింది.ఈ దశలో చాడ జోక్యం చేసుకొని.. ఏకగ్రీవమైతేనే తాను కొనసాగుతానని.. ఒకవేళ పోటీ అనివార్యమైతే పోటీ నుంచి విరమించుకుంటానని ప్రకటించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పల్లా వెంకట్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో.. ఈ ప్రతిపాదనతో ఏకగ్రీవం కోసం పార్టీ నేతలు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ, ఎన్నిక అనివార్యం అవ్వటంతో .. అధిక ఓట్లు దక్కించుకున్న కూనంనేని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications