రేవంత్పై ఎల్ రమణ సంచలనం, కొడంగల్లో ఓడించకుంటే.. కేసీఆర్కూ సవాల్
కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల రమణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల రమణ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ అనే దెయ్యం తమ అధినేత చంద్రబాబుకు దగ్గరై, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు గ్రహణంలా పట్టిందన్నారు.
రేవంత్ భారీ స్కెచ్, కేసీఆర్కు తొలిదెబ్బ, టీఆర్ఎస్ ఆందోళన!: టచ్లో నాయకులు
Recommended Video
టీడీపీ కార్యాలయానికి పట్టిన గ్రహణం ఇప్పుడు తొలగి పోయిందన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కు ఆ దెయ్యం పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 29 తర్వాత రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు.
మా పార్టీ కార్యక్రమాలను హైజాక్ చేశారు
కొడంగల్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఎల్ రమణ చెప్పారు. టీడీపీ కార్యక్రమాలను కూడా రేవంత్ రెడ్డి హైజాక్ చేశారని, రైతు పోరు, విద్యార్థి పోరుయాత్ర కార్యక్రమాలు తమవేనని చెప్పారు. వాటిని రేవంత్ హైజాక్ చేశారన్నారు.
కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం
అంతకుముందు ఎల్ రమణ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, ప్రగతి భవన్పై టీడీపీ జెండా ఎగురవేస్తామని, కొడంగల్ ఉపఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించడం ఖాయమని చెప్పారు.
నా అత్తగారి ఊరు, దేనికైనా సిద్ధం
కొడంగల్ తన అత్తగారి ఊరు అని, అక్కడ ఉప ఎన్నికలు జరగకపోతే వచ్చే మార్చి 29లోపు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని, ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్లకన్నా టీడీపీకి ఎక్కువ ఓట్లు రాకపోతే దేనికైనా తాను సిద్ధమేనని రమణ సంచలన సవాల్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ లేదని భావిస్తుంటే ఏకంగా కొడంగల్లో గెలుస్తామని, కాంగ్రెస్, టీఆర్ఎస్ల కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని చెప్పడం గమనార్హం.
పన్నాగంతో రేవంత్ రెడ్డి రెక్కలు విరిచారు
టీడీపీ కార్యకర్తలు గెలిపిస్తేనే రేవంత్ గెలిచారని, కానీ నాదెండ్ల భాస్కర రావు మాదిరిగా ఆయన కుట్ర చేస్తున్నారని తెలిసి పద్ధతి ప్రకారం టీడీపీ చర్యలు తీసుకుందన్నారు. కుంతియా పన్నాగాలను భగ్నం చేసి, రేవంత్ రెక్కలు విరిచామన్నారు.
తాలు అంతా వెళ్లిపోయింది
పొలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. రేవంత్ను నమ్మిన పాపానికి పార్టీని మోసం చేశారని, అసలు గింజలు పార్టీలోనే ఉన్నాయని, తాలు అంతా వెళ్లిపోయిందన్నారు.