చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ వేదిక నుంచి మాట్లాడుతున్నా, కాంగ్రెస్తో కలుద్దామని నేనే చెప్పా: ఎల్ రమణ
హైదరాబాద్: నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి ఓ తెలుగుదేశం పార్టీ నేత మాట్లాడే అవకాశం వచ్చిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ శుక్రవారం అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సభకు రావాలని చెప్పారని తెలిపారు.
తెరాస అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పారని, కానీ ఆ హామీ అమలు చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన దొర తానే సీఎం అయ్యారన్నారు. అర్ధాంతరంగా సభను రద్దు చేశారన్నారు.
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజే తెలంగాణ సమాజ ఆత్మగౌరవం కాంగ్రెస్తో కలవాలని సీపీఐ, కోదండరాంలతో చెప్పానని ఎల్ రమణ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు వచ్చానని చెప్పారు. అసెంబ్లీ రద్దు అనంతరం తాను ఎన్టీఆర్ భవన్ నుంచి కోదండరాం, చాడ వెంకటరెడ్డిలకు ఓ విజ్ఞప్తి చేశామని, మనమంతా కూటమిగా ఏర్పడుతామని, తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పోదామని మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తిని తానే అని చెప్పారు.
ఏ పేదల బిడ్డడు ఎన్టీఆర్ భవన్లో శంఖారావం పూరించాడో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ సమాజానికి న్యాయం జరగాలని ప్రజా శ్రేయస్సు కోసం తాను ముందుకు వచ్చానని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో ధనిక తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పారు. పేదలకు న్యాయం జరగడంలో కాంగ్రెస్ ముందుండాలని తాము భావించామని చెప్పారు. ప్రజాకూటమిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సోనియా గాంధీకి ధన్యవాదాలు అన్నారు.