సూర్యాపేటలో దారుణం... నిండు గర్భిణిపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారయత్నం...
సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ నిండు గర్భిణిపై అత్యాచారయత్నం జరిగింది. వైద్య పరీక్షల కోసం వచ్చిన ఆ గర్భిణిపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారానికి యత్నించాడు. గర్భిణి పెద్దగా కేకలు వేయడంతో అతను పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతలతండ గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణి ఈ నెల 10న వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులతో కలిసి కోదాడలోని తిరుమల ఆస్పత్రికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె సర్జికల్ ప్రొఫైల్ టెస్ట్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమెను ల్యాబ్కు తరలించగా.. అక్కడ టెక్నీషియన్ శ్రీకాంత్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
టెక్నీషియన్ ప్రవర్తనతో షాక్ తిన్న గర్భిణి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ల్యాబ్ లోపలికి పరిగెత్తగా నిందితుడు శ్రీకాంత్ పరారయ్యాడు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు,కేసును వెనక్కి తీసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం బాధితురాలి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆస్పత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండటంతో కేసు ఉపసంహరించుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Recommended Video
గత నెలలో మధ్యప్రదేశ్లోని భోపాల్లోనూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళా పేషెంట్పై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన ఆమెపై వార్డు బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన జరిగిన 24 గంటల్లోనే బాధితురాలు కన్నుమూసింది.మృతురాలు 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితురాలు. అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ ఆమె వార్డు బాయ్ అఘాయిత్యంతో ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందింది. ఘటనపై భోపాల్ గ్యాస్ బాధితుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణకు ఆదేశించారు.