తెలంగాణలో మహాకూటమిదే గెలుపు, ఎవరికి ఎన్ని సీట్లు అంటే: అన్ని సర్వేలకు భిన్నంగా లగడపాటి
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావించామని, కానీ బాగానే ఉందని చెప్పారు. ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి సంఖ్య అటు ఇటు ఉండవచ్చునని చెప్పారు.
ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు
ప్రజాకూటమి సీట్లు
గెలుపుపై లగడపాటి మాట్లాడుతూ.. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. రెండు ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చునని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు వస్తాయని చెప్పారు. ప్రజాకూటమికి (కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ) 65 స్థానాలు వస్తాయని చెప్పారు. అయితే పది స్థానాలు ఎక్కువగా లేదా తక్కువగా రావొచ్చునని చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్ సర్వేలు
అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 7 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. రెండు తక్కువ లేదా ఎక్కువ ఉండవచ్చునని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి 35 స్థానాలు వస్తాయని, పది ప్లస్ లేదా మైనస్ అని చెప్పారు. సీపీఎం ఒక స్థానంలో గెలిచే అవకాశముందని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో బీఎల్ఎఫ్ ఓ స్థానాన్ని దక్కించుకుంటుందని తెలిపారు.
సెప్టెంబర్ నుంచి సర్వే
తాము సెప్టెంబర్ నుంచి సర్వే చేశామని లగడపాటి తెలిపారు. గతంలో కంటే ఓటింగ్ పెరిగిందని తెలిపారు. హైదరాబాదులోని ప్రజలు గ్రామాల్లోకి వెళ్లిపోయారని, అందుకే ఓటింగ్ తగ్గిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 58 సీట్లు వస్తాయని లగడపాటి వెల్లడించారు.
ప్రజాకూటమిదే అధికారం
మొత్తంగా తన సర్వేలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. మహాకూటమికి స్పష్టంగా చెప్పాలంటే 55 నుంచి 75 స్థానాలు, తెరాసకు 25 నుంచి 45 స్థానాలు, బీజేపీకి 7 నుంచి 9 స్థానాలు, మజ్లిస్ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు, స్వతంత్రులకు 5 నుంచి 9 స్థానాలు వస్తాయని తేలింది.