లాల్దర్వాజా బోనాల జాతర - అంగరంగ వైభవంగా..!!
పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి.. తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాజ్ భవన్ లో బోనం ఉత్సవాల్లో గవర్నర్ తమిళసై పాల్గొననున్నారు. బోనాల జాతరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. బారీ బందోబస్తు కల్పించారు.
చారిత్రక ఘనకీర్తిని కలిగిన లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రాంరభమయ్యాయి. ఆశాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో మహంకాళికి బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

కాగా, రెండు రోజులపాటు జరుగనున్న జాతరలో నేడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు.
పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న, జియాగూడ సబ్జీమంది, కార్వాన్ దర్బార్ మైసమ్మ, గోల్కొండ తదితర చారిత్రాత్మకమైన ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.
బోనాలు, తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో సాగే విధంగా స్థానిక ఎస్హెచ్వోలు ఇప్పటికే బస్తీ, ఆలయ కమిటీలతో సమావేశాలు నిర్వహించారు. సోమవారం వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మంత్రులు.. ప్రముఖులు...రాజకీయ నేతలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి రానున్నారు.












Click it and Unblock the Notifications