మీకు మార్గదర్శకులు ఎవరు?: ‘ఎవరెస్ట్’ పూర్ణ ప్రశ్నకు సమాధానమిచ్చిన ప్రధాని మోడీ
నిజామాబాద్/న్యూఢిల్లీ: ఎవరెస్టు శిఖరాన్ని అతిపిన్న వయసులోనే అధిరోహించి రికార్డు సృష్టించిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ముచ్చటించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన పూర్ణ గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానితో మాట్లాడారు.

‘మీరు ఉన్నతస్థాయికి ఎదగడానికి మార్గదర్శకులెవరు?' అని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. తొమ్మిది రాష్ర్టాలనుంచి ఎంపికచేసిన 10 మంది విద్యార్థుల్లో ప్రథమంగా పూర్ణకే మోడీతో మాట్లాడే అవకాశం లభించింది. పూర్ణ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తన తల్లి ప్రోత్సాహం, స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ఎదిగానని చెప్పారు. వివేకానంద తనకు ఆదర్శప్రాయుడని తెలిపారు.
ఎవరెస్టు అధిరోహించి వచ్చిన తరువాత నీ స్నేహితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అని పూర్ణను ప్రధాని అడిగారు. తనను చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, చదువు, ఆటపాటల్లో ఉత్సాహం చూపుతున్నారని పూర్ణ చెప్పింది.

వీడియోకాన్ఫరెన్స్ తర్వాత పూర్ణ మాట్లాడుతూ.. ప్రధానితో మాట్లాడే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పూర్ణ వల్ల నిజామాబాద్ జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని కలెక్టర్ యోగితారాణా పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ యోగితారాణా, అదనపు జేసీ రాజారాం, తాడ్వాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు స్మిత, పూర్ణ తల్లిదండ్రులు లక్ష్మి, దేవిదాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
వీరితోపాటు అనంతపురం, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications