Telangana: భూముల విలువ పెంపు -ఎకరా రూ.75వేలు -చార్జీల బాదుడు -కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు
సంక్షేమ పథకాలు నిరాటంకంగా సాగేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్ని అమ్మేందుకు సిద్ధమైన కేసీఆర్ సర్కారు ఆ దిశగా కీలక అడుగు వేసింది. తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం సీఎస్ సోమేశ్ కుమార్ పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి భూముల విలువ సవరణ అమల్లోకి రానుంది. దీని ప్రకారం..

భూములు, రిజిస్ట్రేషన్ ధరల పెంపు
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుంలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

ఇకపై ఎకరం కనీసం రూ.75వేలు
రాష్ట్రంలో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆరు శాతం రిజిస్ట్రేషన్ రుసుంను 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. స్లాబుల వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ.100 నుంచి రూ.200లకు పెంచిన ప్రభుత్వం.. స్లాబులు వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువలను పెంచినట్లు స్పష్టం చేసింది. ఆలాగే అపార్ట్మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పెరిగేవి ఇవే.. ఎందుకంటే..
తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించలేదని, ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ), తలసరి ఆదాయం రెట్టింపయ్యాయని, కొత్త ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందిందని, సాగునీటి వసతి విస్తరించడంతోనే భూముల విలువ భారీగా పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, టూరిజం, రియాలిటీ రంగాల విస్తృతి, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత రింగు రోడ్లు తదితర కారణాలతోనూ భూముల మార్కెట్ విలువలు సవరించారు. కేసీఆర్ సర్కారు తాజా ఉత్తర్వులతో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతోపాటు అగ్రిమెంట్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్, గిఫ్ట్, టైటిల్ డీడ్ డిపాజిట్, జీపీఏ, వీలునామా, లీజు సేవలు తదితర ధరలు కూడా పెరుగుతాయి. భూముల విలువ పెంపు ద్వారా రాబోయే రోజుల్లో చేపట్టబోయే వేలం పాటలతో అధిక ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.












Click it and Unblock the Notifications