ఆర్కేను ఇలా చంపారు.. భూమి కొనుగోలు అని చెప్పి.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్
పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు రాశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాజీ హోంగార్డు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ గౌడ్ హత్య.. పరువు హత్య అని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. హత్యలో మొత్తం 11 మంది నిందితుల ప్రమేయం ఉందని తేల్చారు. నలుగురు నిందితులను రిమాండ్కు తరలించారు.
రామకృష్ణ ఈ నెల 15వ తేదీన కనిపించకుండా పోయారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు పోలీసులు ఫిర్యాదు వచ్చింది. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారాం గ్రామ శివారులో రామకృష్ణ హత్య జరిగింది. హత్య జరిగిన ప్రదేశంలో జమ్మపురం గ్రామ సర్పంచ్ భర్త పసుల అమృతయ్య ఉన్నారు. ఆయనే ఈ కేసులో కీలక సాక్షి. రామకృష్ణ హత్యకు సంబంధించిన సెక్షన్ 302, 201, 506 , 109 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్య కేసులో ప్రమేయం ఉన్న బీబీనగర్ పోలీస్ స్టేషన్ హోంగార్డు యాదగిరిని కూడా నిందితుడిగా చేర్చారు. రామకృష్ణ హత్య కేసు సూత్రధారి భార్గవి తండ్రి వెంకటేష్గా తేల్చారు.
భార్గవిని రామకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా స్థిరంగా లేడని, తనతో తిరుగుతూనే తన కూతురు భార్గవిని రామకృష్ణ ట్రాప్ చేశాడని వెంకటేశ్ కోపం పెంచుకున్నాడు. వెంకటేశ్ లతీఫ్ను బీబీనగర్ పోలీస్ స్టేషన్ హోంగార్డు యాదగిరి పరిచయం చేశారు. ఆరు నెలలుగా రామకృష్ణను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. రామకృష్ణ హత్యకు లతీఫ్ గ్యాంగ్తో భార్గవి తండ్రి వెంకటేశ్ రూ. 10 లక్షలు సుపారీ కుదుర్చున్నాడు. భూమి కొనుగోలు పేరుతో రామకృష్ణను నమ్మించిన లతీఫ్ గ్యాంగ్.. కత్తి, గొడ్డలితో నరికి చంపారు. అతని మృతదేహాన్ని సిద్దిపేట్ జిల్లా లకుడారం వద్ద పూడ్చిపెట్టారు.
హత్య కేసులో భార్గవి తండ్రి పల్లెపాటి వెంకటేశం A1, A2 దోర్నాల యాదగిరి ( హోంగార్డ్ బీబీ నగర్ పీఎస్).. ఇతనిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. A3 దంతురీ రాములు వలిగొండ A4 సయ్యద్ లతీఫ్ ( సిద్దిపేట ) A5 గోలి దివ్య అలియాస్ ముస్కాన్ ( లతీఫ్ భార్య ) A6 మహమ్మద్ అఫ్సర్ ( సిద్దిపేట) A7 పొలస మహేష్ ( సిద్దిపేట ) హోటల్ వెయిటర్ A8 మహమ్మద్ సిద్దిక్ ( మోత్కూరు ) A9 తొట్ల ధనలక్ష్మి ( వేముల వాడ) A10 తొట్ల నరేందర్ ( వేములవాడ) A11 తొట్ల భాను ప్రకాష్ ( వేములవాడ ) A9, A10, A11 తల్లి ఇద్దరు కొడుకులు ఉన్నారు.