పాలమూరుకు పట్టిన శని: చంద్రబాబుపై విరుచుకుపడిన లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాకు పట్టిన శని చంద్రబాబునాయుడు అని విమర్శించారు. గతంలో జిల్లాను దత్తత తీసుకుని జిల్లా వెనుకబాటును చూపించి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెచ్చుకున్నారని.. ఆ నిధులను ఆంధ్రాలో ఖర్చు పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు.
శుక్రవారం తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంకు చెందిన పలువురు కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నేతలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని, ఉద్యమ పార్టీ అని అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు మంచి రోజులొచ్చాయని అన్నారు. టిడిపి, కాంగ్రెస్ నేతల చేతగాని తనంవల్లే జిల్లా వెనుకబడిపోయిందని మండిపడ్డారు. జిల్లా వెనుకబాటుకు ఆంధ్రా పాలకులతోపాటు ఈ జిల్లా నాయకులు కూడా కారణమని ఆరోపించారు.
ఆంధ్రాలో ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తయితే మన ప్రాజెక్టులు పదేళ్లయినా పూర్తి కాలేదని అన్నారు. మన నీళ్లను మనమే సాధించుకోవాలని అన్న ఆయన, తొందరలోనే పెండింగ్ ప్రాజెక్టుల చిక్కుముడి పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాకు పట్టిన శని చంద్రబాబు అని విమర్శించారు.
అప్పుడు జిల్లాకు ఏమి చేయని చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక కూడా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో చంద్రబాబు కడతానంటున్న ప్రాజెక్టులను కమీషన్ల కోసమే కడుతున్నారా? అని లక్ష్మారెడ్డి నిలదీశారు.
చంద్రబాబులా తాము కమీషన్ల కోసం కక్కుర్తి పడబోమని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు పోతామని అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చే.. డిఎస్ లాంటి నేతలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని లక్ష్మారెడ్డి తెలిపారు.